ఇబ్రహీంపట్నం, నవంబర్ 29 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గురువారం జరుగనున్న శాసనసభ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మేరకు ఈవీఎంలు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. ఉదయం నుంచి సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకున్న సిబ్బంది మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సామగ్రితో ఆయా గ్రామాలకు తరలివెళ్లారు. నియోజకవర్గంలో మొత్తం 3,27,583మంది ఓటర్లున్నారు. వీరికోసం 343 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం బదిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో ప్రధానపోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంది.
ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి : అనంతరెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 343పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవటానికి వచ్చే వారి కోసం తాగునీరు, ఇతరత్రా సౌకర్యాలు కూడా కల్పించామన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వీల్చైర్లు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఓటర్లు స్వేచ్చగా ఓటును వినియోగించుకోవటం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత గట్టి భద్రత మధ్య ఈవీఎంలను సీవీఆర్ కళాశాలలోని స్ట్రాంగ్రూంలో భద్రపరుస్తామన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్
ఎలాంటి ఘర్షణలు జరుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 136 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, ఈ గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ఉండటం కోసం ైస్టెఫింగ్ ఫోర్స్కూడా అందుబాటులో ఉందని అన్నారు. ప్రజలు స్వేచ్చగా ఓటువేసుకోవటం కోసం రాజకీయ పార్టీలు సహకరించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలకు పాల్పడినా…వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మంచాల, యాచారం మండలాల్లోని మారుమూల గ్రామాల్లో కూడా ఎన్నికలు సజావుగా జరగటానికి తగిన పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఎన్నికలకు సర్వం సిద్ధం
యాచారం, నవంబర్ 29 : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. మండలంలో మొత్తం 57,847మంది ఓటర్లున్నారు. 24గ్రామ పంచాయతీలకు గాను 59 బూతులను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో సైతం సీఐ రామాంజనేయులు, ఎస్ఐ ప్రసాద్లు పోలింగ్ కేంద్రాలకు భద్రత కల్పించారు. యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో 49,055మంది ఓటర్లు ఉండగా, ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8,792మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో అసెంబ్లీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఓటర్లకు ఓటరు చీటీల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. పోలింగ్ బూత్ల విషయంలో ఓటర్లకు ఉన్న సందేహాలను తీర్చేందుకు బుధవారం మున్సిపల్, రెవెన్యూ సిబ్బందితో కూడిన బృందాలను మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఆయా కేంద్రాల వద్దకు ప్రజలు వస్తూ.. తమ పోలింగ్ బూత్ల వివరాలు తెలుసుకుంటున్నారు. పలువురు ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో, లేవో అనే విషయాలను సైతం నేరుగా వచ్చి ఆరాతీశారు. వివిధ సందేహాలతో వచ్చేవారికి సిబ్బంది అన్నివిధాలా సహకరించారు.
163 పోలింగ్ కేంద్రాలు
అబ్దుల్లాపూర్మెట్ : ఇబ్రహీంపట్నం-48 నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ మండలంలో తాసిల్దార్ రవీందర్దత్తు ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో సిబ్బందిని, ఈవీఎం బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. అబ్దుల్లాపూర్మెట్ ఓటర్ల ముసాయిదా జాబితా -2023 ప్రకారం గతంలో 139 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం శాసన సభ ఎన్నికలకు 24 అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తాసిల్దార్ రవీందర్దత్తు తెలిపారు. నూతన పోలింగ్ కేంద్రాలతో కలిపి మండల పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 163 చేరింది.
నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు మునుగనూరు ఎడ్యుస్మార్ట్ పాఠశాలలో-2, మండల పరిషత్ పాఠశాలలో -3, ఇంజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో -3, తుర్కయంజాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో- 7, రాగన్నగూడ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో -2, కమ్మగూడ సెయింట్ జోసప్ పాఠశాలలో -3, కుంట్లూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో -3, పసుమాముల మండల పరిషత్ పాఠశాలలో -1 మొత్తం 24 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 1,67,452 ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 85101, మహిళా ఓటర్లు 82320, థర్డ్ జెండర్ -31 మంది ఉన్నారు.