కొత్తూరు, మార్చి 23: రెండు ఎన్నికల నోటిఫికేషన్లకు సంబంధించిన కోడ్ ఉన్నా కాంగ్రెస్ నాయకులు లెక్క చేయడంలేదు.ఈ నెల 28న పట్టభద్రుల ఎన్నిక జరుగనున్నది. దీంతోపాటు ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే కాంగ్రెస్ నాయకుల ఇవేమీ లెక్క చేయకుండా పట్ట పగలే బహిరంగంగా డబ్బులు పంచుతూ మీడియాకు దొరికిపోయారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి కొత్తూరు మండలంలోని జేపీ దర్గాలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. అయితే పనిలో పనిగా ఇన్ముల్నర్వలో ఓ చిన్నపాటి సభను ఏర్పాటు చేశారు. ఇందుకోసం డబ్బులు ఇస్తామని జనాన్ని పోగు చేశారు. ముందుగా ఇన్ముల్నర్వలో మీటింగ్ ముగించుకొని ఆ తర్వాత జహంగీర్ పీర్ దర్గాలో ఇఫ్త్తార్ విందుకు వెళ్లారు. అయితే పట్ట పగలే జనానికి డబ్బులు పంచుతూ అడ్డంగా మీడియాకు దొరికిపోయారు. సభకు వచ్చిన మహిళలకు అరకొరగా డబ్బులు పంచడంతో లొల్లి మొదలయింది. ఇచ్చిందే అరకొర అందులో వచ్చిన వారిలో కొంత మందికే ఇవ్వడంతో అందరికీ ఇవ్వాలని మహిళలు గొడవ పెట్టుకున్నారు.