మొయినాబాద్ : గ్రామాభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని, గ్రామాభివృద్ధికి నిధులు కూడా కేటాయిస్తానని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. మండల పరిధిలోని తోలుకట్టా గ్రామంలోని మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహరావు మెమోరియల్ ట్రస్ట్ ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోలుకట్టా గ్రామాభివృద్ధికి రూ. 20 లక్షలు నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఆమెకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తన తండ్రి పేరున జ్ఞాపకార్థం నిలయం ఉండటంతో తోలుకట్టా గ్రామం మీద అమిత ప్రేమ ఉందని చెప్పారు. గ్రామానికి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీ రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బిలాల్ ఉన్నారు.