కొడంగల్, ఏప్రిల్ 15 : ‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదు.. గడిచిన పదేండ్లలో కేంద్ర సర్కార్ రాష్ర్టానికి చేసిన అభివృద్ధి ఏమీలేదు.. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో జనానికి కష్టాలు మొదలయ్యాయి.. నాలుగు నెలల్లోనే రేవంత్ పాలనపై ప్రజలకు విసుగు పుట్టింది.. కొని తెచ్చుకొన్న కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలో నిర్వహించిన మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణను రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకోసం పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని లక్షా 49వేల ఎకరాలకు సాగునీరందే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ విస్మరించిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరివెన ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతోపాటు కాలువల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. కేంద్రంలో బీజేపీ పాలన.. రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎంత తేడా ఉందో ప్రజలు ఓ సారి ఆలోచించుకోవాలన్నారు. బీజేపీ గుడి కట్టించాం అని ప్రచారం చేసుకుంటున్నదని, తెంగాణలో కేసీఆర్ నిర్మించిన యాదాద్రి వంటి ఎన్నో దేవాలయాలు, బడులు, సాగునీటి ప్రాజెక్టులు వారికి కనిపించవా అన్ని ప్రశ్నించారు.
నేడు జీఎస్స్టీ పుణ్యమా అని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. దేశంలో 155 మెడికల్, 177 నర్సింగ్ కళాశాలలను కేంద్రం మంజూరు చేస్తే, అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టి తెలంగాణపై బీజేపీకి ఏమాత్రం బాధ్యత ఉందో అర్థమవుతుందన్నారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందని, అన్ని రంగాల్లో ప్రగతి సాధించి దేశంలో తెలంగాణ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు, నోటికొచ్చిన 420 ఊకదంపుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఇప్పటికీ ఏ ఒక్క గ్యారెంటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, నేటి వరకు రైతుబంధు, రైతు రుణమాఫి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, కేసీఆర్ కిట్, వంటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదని, రెండు పార్టీలను ప్రజలు నిలదీసే రోజు వచ్చిందని గుర్తు చేశారు. కేంద్రలో తెలంగాణకు రావాల్సిన అన్ని నిధులు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఎంపీలుగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కేసీఆర్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, అంజయ్య, మాజీ స్పోర్ట్ చైర్మన్ వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి నిధులివ్వకుండా ప్రగతిని అడ్డుకుంటే, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని బీఆర్ఎస్ మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఈ విషయమై ఓట్ల కోసం వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలను అందుకొని ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకటిమయంగా మారుతుందన్న సమైక్య పాలకుల మాటలు.. నేడు రేవంత్రెడ్డి పాలనలో నిజమవుతున్నాయన్నారు. పార్లమెంటులో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏనాడూ తెలంగాణ అభ్యున్నతికోసం మాట్లాడలేదని, కనీసం ఒక్క మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేయలేదన్నారు.
– బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజార్టీ తగ్గకుండా ఉన్నప్పుడే కేంద్రం నుంచి అభివృద్ధి నిధులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలను సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సర్వేలు, ఇంటలిజెన్స్ రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి అధికంగా సీట్లు వస్తాయని తెలుసుకున్న రేవంత్రెడ్డి ఓటమి భయంతో పూటకో మాట మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కొడంగల్ అభివృద్ధికి రూ.4వేల కోట్లను మంజూరు చేసి అభివృద్ధి సాధించిందన్నారు. ఎన్నికలకు ముందు మరో రూ.900 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆ అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు.
– మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కేసీఆర్ హయాంలో వ్యవసాయం ఓ పండుగలా సాగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే కరెంటు లేక, సాగునీరు లేక ఎండుతున్న పంటలతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అన్నదాతలను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలిచ్చిన ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలు గుర్తించారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్తోనే మెరుగైన భ్యవిష్యత్తు ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని గెలిపించి బీఆర్ఎస్ సత్తాని చాటేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు.
– మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్
కేసీఆర్ రైతు పక్షపాతి అని, అందుకే పదేండ్ల పాలనలో రైతులకు అన్ని సౌకర్యాలను కల్పించారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పెట్టుబడి సాయం, నీరు, నాణ్యమైన కరెంట్ అందించి రైతును రాజు చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేయడంతో పాటు ఊహకు అందని ఎన్నో అద్భుత పథకాలను అమలు చేశారన్నారు. కేసీఆర్ ఆలోచన విధానం ఎట్లుండే.. ప్రస్తుతం రేవంత్రెడ్డి ఆలోచన ఏవిధంగా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.
– మాజీ మంత్రి లక్ష్మారెడ్డి