తాండూరు నియోజకవర్గానికి నిధుల వరద పారింది. నెల రోజుల్లోనే రూ.170 కోట్లు మంజూరు కావడం గమనార్హం. వివిధ అభివృద్ధి పనులకుగాను ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలను అందజేయగా, రూ.134.50 కోట్లను మంజూరు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రత్యేక నిధులను రోడ్లు, డ్రైనేజీలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, బంజారా, బీసీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనాల నిర్మాణాలకు వినియోగించనున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రూ.25 కోట్లను వెచ్చించనున్నారు. తాండూరు, పెద్దేముల్, యాలాల మండలాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రూ.10.20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా యంత్రాంగం పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు త్వరలో టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నది. జిన్గుర్తిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చొరవపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, నవంబర్ 28, (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల ఎర కేసులో హీరోగా మారిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి నియోజకవర్గమైన తాండూరు రూపురేఖలు త్వరలో పూర్తిగా మారిపోనున్నాయి. రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉన్న తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే తాండూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రూ.400 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం నెల రోజుల్లోనే ప్రభుత్వం నుంచి తన నియోజకవర్గానికి ప్రత్యేకంగా రూ.170 కోట్ల నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. త్వరలోనే జిన్గుర్తిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సంబంధించి కూడా నిధుల మంజూరుతోపాటు ఏర్పాటు ఉత్తర్వులు రానున్నాయి. మరోవైపు డిసెంబర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ తాండూరు నియోజకవర్గంలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలిసింది.
నియోజకవర్గానికి రూ.170 కోట్ల నిధులు
తాండూరు నియోజకవర్గానికి నిధుల వరద పారింది. కేవలం నెల రోజుల్లోనే రూ.170 కోట్ల నిధులు మంజూరు కావడం గమనార్హం. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు రూ.134.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నర్సింగ్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు నిర్మాణానికి రూ.25 కోట్లు, నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, యాలాల మండలాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకు రూ.10 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది.
బషీరాబాద్ మండలంలో రోడ్లు, డ్రైనేజీల పనుల నిమిత్తం రూ.3 కోట్లు, తాండూరు ఐటీఐ కాలేజీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు, మండల కేంద్రాలతోపాటు గ్రామపంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.78 కోట్లు, తాండూరు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీతోపాటు ఇతర అభివృద్ధి పనులకు ఒక్కో వార్డుకు రూ.కోటి చొప్పున రూ.36 కోట్లు, తాండూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.50 కోట్లు, బంజారాభవన్ నిర్మాణానికి రూ.కోటి, బీసీ భవన్ నిర్మాణానికి రూ.2 కోట్లు, నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులను వెచ్చించనున్నారు.
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణం, ఫర్నిచర్ తదితరాల నిమిత్తం రూ.25 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. తాండూరుకు మంజూరైన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కోర్సులకు సంబంధించి 60 సీట్లను ఖరారు చేశారు. త్వరలో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. కాలేజీ మంజూరుతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా నర్సింగ్ కోర్సు పూర్తి చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. రూ.10.20 కోట్లతో తాండూరు మండలంలోని తాండూరు, జిన్గుర్తితోపాటు యాలాల మండలం జుంటుపల్లి, పెద్దేముల్ మండలం కందనెల్లిలో 33/11 కేవీ సబ్స్టేషన్ల ఏర్పాటుకు రూ.10.20 కోట్ల నిధులను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేయగా.. త్వరలో టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నారు.
గతంలో ఎన్నడూలేని విధంగా తాండూరు నియోజకవర్గ అభివృద్ధి
– ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి
తాండూరు నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గమైన తాండూరుకు పలు అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి, నెలరోజుల్లోనే ఇంతా భారీగా నిధులు మంజూరు కావడం సంతోషం. తాండూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాను. త్వరలోనే నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి జరుగుతుంది.