షాద్నగర్, సెప్టెంబర్ 27: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్బాపూజీ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ప్రారంభించారు. అదే విధంగా మండల పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని బుధవారం పద్మశాలి సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుల్లో ప్రముఖమైన వ్యక్తి కొండా లక్ష్మణ్బాపూజీ అని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. కొండా లక్ష్మణ్బాపూజీ జయంతి, వర్ధంతిలను తెలంగాణ సర్కార్ అధికారంగా నిర్వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. తెలంగాణ సర్కార్ పద్మశాలిల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కో-ఆప్షన్ సభ్యుడు కిషోర్, మాజీ చైర్మన్ విశ్వం, సంఘం అధ్యక్షుడు జనార్ధన్, మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, సభ్యులు, నాయకులు చెన్నయ్య, నర్సింహులు, కృష్ణయ్య, నారాయణరెడ్డి, శ్రీశైలం, నందకిషోర్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ జి. మల్లేశ్ పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు నిరంజన్, జిల్లా బీసీఫ్రంట్ అధ్యక్షుడు కృష్ణయాదవ్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం రంగారెడ్డిజిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆది గురువు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మల్లేశ్యాదవ్ మాట్లాడుతూ.. బీసీకులాలందరూ ఏకమై జేఏసీ ఏర్పాటు చేసుకుని బీసీల రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
మాడ్గుల : మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని బుధవారం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పులమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలోని బీఆర్ఎస్ నాయకులు పల్లేటి యాదయ్య, గ్రామ కార్యదర్శి తిరుపతి, వార్డు సభ్యుడు జంగయ్య, కృష్ణయ్య, మల్లేశ్, శివరాజ్, విక్రమ్, కిరణ్, శ్రీశైలం, నరసింహ, శివ పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని పద్మశాలి సంఘం జిల్లా నాయకుడు శ్రీనివాస్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో బాపూజీ విగ్రహం వద్ద పద్మశాలి సంఘం నాయకులు నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై బాల్రామ్ , పద్మశాలి సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ, సంఘం అధ్యక్షుడు రవి, కార్యదర్శి శివలింగం, సంఘం నాయకులు రవి, వెంకటేశ్, అప్పి, శ్రీను, కిష్టయ్య, భాస్కర్, లింగం, చంద్రమౌళి, వెంకటేశ్, సురేశ్, సత్యం, శ్రీను, రఘు, ప్రసాద్, జగదీశ్ పాల్గొన్నారు.