వికారాబాద్, (నమస్తే తెలంగాణ) 25 : కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఫోన్లో మాట్లాడి పరిస్థితులను సమీక్షించి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, అత్యవసర బృందాలు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలన్నారు. నదులు, కాలువల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాల సమీపంలోకి వెళ్లరాదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.