బడంగ్పేట, సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్లో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్ రెడ్డితో కలిసి ఆసరా పింఛన్దారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందిస్తామని ఆమె అన్నారు. దళితబంధు మాదిరిగానే గిరిజనబంధు అందించి గిరిజనులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేస్తామన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం గిరిజనులకు ఒక వరమన్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారి మాట ఇస్తే కట్టుబడి ఉంటారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ అన్నదాతల మెప్పు పొందుతున్నారన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఆధ్వానంగా మారిందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్నదన్నారు. దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు రావాలని, సీఎం కేసీఆర్ వంటి విజన్ ఉన్న మహానేత జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలన్నారు. ప్రతి నెలా మహేశ్వరం మండలంలో రూ.1.18 కోట్ల పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు, వితంతువులకు, వృద్ధులతో పాటు ఒంటరి మహిళలు, నేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాలు, కిడ్నీ రోగులకు ఆసరా పింఛన్ అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఎంత భారమైనా ఆసరా పింఛన్లు అందజేస్తున్నారన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఆరు వందల పింఛన్ మాత్రమే ఇస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మూడు వేలు, రెండు వేల పింఛన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. రూ.200లు ఉన్న ఆసరా పింఛన్ మూడు వేలకు పెంచడంతో పింఛన్దారులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతాఅంధ్యానాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.