పరిగి, సెప్టెంబర్ 6: వికారాబాద్ జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలోని సర్పన్పల్లి ప్రాజెక్టులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేప పిల్లలను వదలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో ఈ ఏడాది కోటీ26 లక్షల చేప పిల్లలను ఉచితంగా అందజేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 834 చెరువులు, కుంట లు, 10 రిజర్వాయర్లలో చేప పిల్లలను వదులనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చేప పిల్లలను కొనుగోలు చేశారు. ఇందులో 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజు గల కోటి చేప పిల్లలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు గల 26 లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి ఆయా చెరువులు, కుంటల్లో
విడుదల చేయనుండటంతో మత్స్యకారుల కుటుంబాలకు మేలు జరుగనున్నది.
35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజు గల ఒక్కో చేప పిల్లకు 37 పైసల చొ ప్పున కోటి చేప పిల్లలకు రూ.37లక్షలు, 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజు గల ఒక్కో చేప పిల్లకు రూ. 1.32 చొప్పున 26 లక్షల చేప పిల్లలకు రూ.34 లక్షలు వెచ్చించి మొత్తం రూ.71 లక్షలతో చేప పిల్లలను అధికారులు కొనుగోలు చేశారు. నీలి విప్లవాన్ని సాధించేందుకు ప్రభుత్వం కొన్నేండ్లుగా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. జిల్లాలో 108 మత్స్యకారుల సహకార సంఘాలుండగా అం దులో 4,500 మంది సభ్యులున్నారు. ఉచితంగా చేప పిల్లలను అందించడం ద్వారా 4,500 మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి లభించనున్నది. బుధవారం మంత్రి చేతులమీదుగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత జిల్లాలోని చెరువులు, కుంటల్లో ఉచిత చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
194 మందికి న్యూట్రిషన్ కిట్లు..
జిల్లాలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ కలెక్టరేట్లో ప్రారంభించనున్నారు. జిల్లాలోని 194 మంది పిల్లలకు న్యూట్రిషన్ కిట్లను అందజేయనున్నారు. 11 నుంచి 14 ఏండ్లలోపు గల పోషకాహార లోపంతో బాధపడుతున్న కిశోర బాలికలు, దివ్యాంగులకు ఈ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లో 10 కిలోల గోధుమలు, 500 గ్రాముల నెయ్యి, కిలో ఖర్జూరం పండ్లు, 750 గ్రాముల ప్రొటీన్ బిస్కెట్స్, 800 మిల్లీలీటర్ల ఐరన్, జింక్ సిరప్, క్యాల్షియం, మల్టీ విటమిన్తో కూడిన 90ట్యాబ్లెట్లు ఉంటాయి.