ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ సర్కారు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండే టెలీ మెడిసిన్ సేవలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో అందుబాటులోకి తెచ్చింది. టాటా ట్రస్టు సర్వీసెస్ సౌజన్యంతో ఈ సర్వీసెస్ను ఇటీవలే ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలోని పలు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, బస్తీ దవాఖానల నుంచి రోగులు వారివారి రోగ నిర్ధారణతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స తదితర విషయాలకు సంబంధించి జిల్లా ప్రభుత్వ దవాఖానలోని సంబంధిత స్పెషలిస్టు డాక్టర్చే నిత్యం టెలీ మెడిసిన్ ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు.
జిల్లా పరిధిలోని ప్రైమరీ,అప్పర్ ప్రైమరీ హెల్త్సెంటర్, బస్తీ దవాఖానలకు ప్రతి రోజూ పలువురు రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు వివిధ జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఆయా హెల్త్ సెంటర్లు, బస్తీదవాఖానకు చెందిన వైద్యులతో టెలీమెడిసన్ సర్వీసెస్ కోసం నేరుగా రోగితో వీడియో కాల్లో జిల్లా ప్రభుత్వ దవాఖానలో స్పెషలిస్టు వైద్యుడికి కనెక్టు చేసి సంబంధిత వ్యాధి డాక్టర్చే తగు సలహాలు, సూచనలు, అందిస్తారు. ఆయా వ్యాధికి సంబంధించి స్పెషలిస్టు వైద్యులు రోగికి వ్యాధికి సంబంధించిన సమాచారంతో పాటు ఏయే మందులు ఎలా వాడాలో రోగికి సూచిస్తారు. ఈ ప్రక్రియ ప్రతిరోజూ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మధ్యాహ్నం12 నుంచి 2 గంటల వరకు కొనసాగుతుంది. జిల్లాలోని 37 పీహెచ్సీ, యూపీహెచ్, బస్తీదవాఖానల నుంచి ఈ టెలీమెడిసన్ సర్వీస్ను వినియోగించుకునే అవకాశం ఉంది. టెలీ మెడిసిన్ విధానంలో సోమవారం నుంచి శనివారం వరకు రోజుకొక వైద్య నిపుణుడు రోగులకు అందుబాటులో ఉంటాడు.
వీడియో కాల్లో సమస్యను చెబుతున్నపుడు డాక్టర్ బాగా వింటున్నారు. అన్ని వివరాలు కూలంకషంగా అడిగి తెలుసుకుని మందులు వాడమని ఏఏ మందులు వాడాలో చెపుతుంటే మా పక్కనే ఉన్న పీహెచ్సీ సిబ్బంది వాటిని ప్రిస్కిప్షన్పై రాసి మాకు ఇస్తున్నారు. ఈ టెలీమెడిసన్ సర్వీసు వల్ల ఎక్కడో ఉన్న జిల్లా దవాఖానకు వెళ్లలేని తమలాంటి పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది.-దివ్య, పేషెంట్, బీజేఆర్నగర్ మల్కాజిగిరి
టెలీ మెడిసన్ సర్వీసుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఆయా పీహెచ్సీ, యూపీహెచ్, బస్తీదవాఖానల నుంచి నేరుగా వీడియో కాల్ ద్వారా వారివారి జబ్బులను తమ స్పెషలిస్టు డాక్టర్కు చెప్పడం, వీడియో కాల్లోనే వారికి అర్థమయ్యే విధంగా తగిన మందులు వేసుకొమ్మని, ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఉంటే నేరుగా జిల్లా దవాఖానకు వచ్చి డాక్టర్ని సంప్రదించమని చెపుతున్నాం. మా వైద్యబృందం సైతం ప్రతి పేషంట్ను జాగ్రత్తగా వారి సమస్య విన్న తర్వాతే ఆ సమస్యకు సంబంధించిన మందులను వాడమని సలహాలు ఇస్తున్నారు. నిత్యం రెండు గంటల పాటు ఈ సేవలను అందిస్తున్నాం. -జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్