శామీర్పేట, జూన్ 21 : శామీర్పేట చెరువులో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు సోదరుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… బీహార్ రాష్ట్రం వారణాసికి చెందిన గౌతం(28) ఆయుర్వేద డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య స్వప్న కేసరి. గౌతం తమ్ముడు నందన్(26) ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా ఎక్సెల్ ఆస్పత్రిలో పనిచేస్తూ.. అల్వాల్లో నివాసం ఉంటున్నాడు. కాగా.. గత వారం రోజుల క్రితం గౌతం.. తమ్ముడి వద్దకు వచ్చాడు.. ఆదివారం వారిద్దరు శామీర్పేట చెరువు వద్దకు బైక్పై వెళ్లారు.
కాగా… శామీర్పేట చెరువులో తన స్నేహితుడు నందన్ చిక్కుకున్నాడని ఎక్సెల్ ఆస్పత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్న కల్యాణి.. తన సోదరుడు బోయపాటి సాయిచంద్కు సమాచారం అందించింది. వెంటనే అతను.. స్నేహితుడు గణేశ్తో కలిసి శామీర్పేట చెరువు పరిసర ప్రాంతాల్లో వెతకగా.. అక్కడ యమహా ఎఫ్జెడ్ (టీఎస్08హెచ్ఈ5852) కనిపించింది. దాని పక్కనే బ్యాగ్, సెల్ఫోన్ను గుర్తించారు. నందన్ కనిపించకపోవడతో వారు ఆదివారం రాత్రి శామీర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం ఉదయం గజఈతగాళ్లతో గాలించగా గౌతం, నందన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరు కొడుకుల మృతదేహాలను చూసిన వారి తల్లి భవిత బోరున విలపించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.