కుత్బుల్లాపూర్,ఆగస్టు5: కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయా వర్గాలు, పార్టీలకు చెందిన నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకొని తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. జంట సర్కిళ్ల పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ నాయకులు గురువారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలుసుకొని వినతిపత్రాన్ని అందజేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు వైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం కార్యచరణ రూపొందిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఆస్పత్రి ఏర్పాటుతో ఎంతో మంది నిరుపేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు యేసురత్నం, రాములు, హరినాథ్రావు, ఉమామహేశ్, సహధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో బడ్జెట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్కు పాఠశాలల యాజమాన్యం వినతిపత్రాన్ని అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయని, సీఎం కేసీఆర్ జారీ చేసిన జీవో మేరకు బోధన, బోధనేతర సిబ్బందికి పాఠశాలలు తిరిగి ప్రారంభించేంత వరకు రూ.2 వేల ఆర్థిక సహాయంతో పాటు 25 కిలోల బియ్యం ఇస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీంతో పాటు బిల్డింగ్ పన్ను, ఎలక్ట్రిసిటి బిల్లులు, వాటర్ బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పి.శివయ్య, ముఖ్య సలహాదారు మండవ శ్రీనివాస్గౌడ్, అధ్యక్షుడు ఆర్.వరప్రసాద్, కార్యదర్శి సీహెచ్.మహేశ్, కోశాధికారి జే.దయాకర్, పల్లంశెట్టి రాజేశ్కుమార్, సాధన రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గంగా ఎన్క్లేవ్ వద్ద డ్రైనేజీ అభివృద్ధిపై గురువారం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్, ఆయా విభాగాల అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. వర్షపు నీటి ఓపెన్ నాలాను పరిశీలించిన అనంతరం, దాని నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు నూతన డ్రైనేజీ లైన్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ కృష్ణచైతన్య, వాటర్ వర్క్స్ డీజీఎం రాజేశ్, ఏఈ సురేందర్నాయక్, సిబ్బంది ఉన్నారు.
దుండిగల్, ఆగస్టు5: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ వార్డు నందన వణం కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలోని సమస్యలపై వినతిపత్రాన్ని కార్పొరేటర్ కొలన్ వీరేందర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆయా శాఖల అధికారులతో చర్చించి సకాలంలో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మహేశ్, హోమ్స్ కాలనీ అధ్యక్షుడు ప్రదీప్, కాలనీవాసులు పాల్గొన్నారు.