కుత్బుల్లాపూర్, మే 24: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి.. ప్రజాభివృద్ధి కోసం సాగుతున్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. సోమవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లలోని ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నియోజకవర్గంలో ఒక లక్ష్యం దిశగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూనే భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఉండేలా కోట్ల రూపాయాలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు.
కరోనా సమయంలో నియోజకవర్గంలో సుమారు 500 సంక్షేమ సంఘాల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను తెలుసుకునేందుకు తన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే 60 కాలనీల సంక్షేమ సంఘాల వారితో చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి వచ్చిన సమస్యలను సకాలంలో పరిష్కరించేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం జంట సర్కిళ్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పలు ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటికీ కొన్ని కాలనీల్లో పనులు ఇంకా మొదలు పెట్టకపోవడం వంటి పలు అంశాలపై చర్చించారు.
అభివృద్ధి నిర్మాణాలకు కావాల్సిన నిధులు అందుబాటులో ఉన్నా.. ఆ దిశగా అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా జంట సర్కిళ్ల పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సకాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆయా సర్కిళ్ల ఇంజినీరింగ్ విభాగం ఈఈ కృష్ణ చైతన్య, డీఈఈలు రామ్చందర్రాజు, శిరీష, పాపమ్మ, ఏఈలు సురేందర్నాయక్, సంపత్, ఆశలు, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ కుటుంబాన్ని సాదుకుంటున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడింది. నిరుపేద కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పందించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు. ఏడాది క్రితం గాజులరామారం డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో నివాసం ఉండే ఎస్.నరేంద్రకుమార్(40) టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పిండి పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నరేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చొరువ చూపి సంబంధిత విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడి రూ.5 లక్షల నష్టపరిహారం ఇచ్చేలా కృషి చేసి ఆ చెక్కును సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఎమ్మెల్యే చేసిన కృషికి బాధిత కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఆంజనేయు లు, నారాయణరావు, వి.వేమారెడ్డి పాల్గొన్నారు.