మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 5 : మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లిలో ఆదివారం కోటి రూపాయలతో చేపట్టిన వైకుంఠధామం అభివృద్ధి పనులకు శంకుస్థాపన, దమ్మాయిగూడ 9వ వార్డు, నాగారం 13వ వార్డుల్లో సీసీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నదని, ఇందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలో సాగాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది ప్రత్యేక నిధులను కేటాయిస్తూ సహకరిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజావసరాలపై అవగాహన ఉన్నదని, అందువల్లే రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు ఎ.వాణి రెడ్డి, స్వామి, టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు ఓర్సు రాములు, వైస్ చైర్మన్లు మల్లేశ్ యాదవ్, నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, కౌకుట్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, హరిగౌడ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.