మేడ్చల్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం అందించే రుణాలను అర్హులైన వారు పొంది వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ నెల 26న జిల్లాలోని ఉప్పల్ రింగ్ రోడ్డు మేకల భారతి గార్డెన్లో ఈ మేళాను జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శనివారం తెలిపారు. వివిధ బ్యాంకులు సంయుక్తంగా రుణ మేళా నిర్వహిస్తున్నందున అర్హులైన లబ్ధిదారులంతా హాజరుకావాలన్నారు. ఇంటి రుణాలు, పై చదువుల కోసం విద్యార్థులు, వ్యవసాయ, స్వయం సంఘాలకు వ్యాపార రుణాలు అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రుణాలను పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు వాయిదాలను సకాలంలో చెల్లించాలని కోరారు.