తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలు పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడున్న పచ్చదనం.. స్వచ్ఛమైన గాలినిచ్చే పెద్ద, పెద్ద చెట్లు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. వానకాలంలో ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల సవ్వడి.. వినసొంపైన పక్షుల కిలకిల రావాలు మైమరిపిస్తాయి. చెంతనే ఉన్న అత్యంత ప్రసిద్ధిగాంచిన అనంతపద్మనాభ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను ఆవిష్కరిస్తున్నది. అనంతగిరి హిల్స్ను టూరిజం పరంగా మరింత అభివృద్ధిలోకి తీసుకొచ్చే దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 213 ఎకరాల్లో సకల వసతులు కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఎకో టూరిజంతోపాటు కన్వెన్షన్ సెంటర్, హోటల్, రిసార్ట్, కాటేజెస్, ఆంఫిథియేటర్, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, యోగా, ధ్యాన కేంద్రాలు, స్పా, స్విమ్మింగ్ పూల్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ల ఏర్పాటుకు ప్లాన్ రూపొందించారు. ట్రెక్కింగ్, వాచ్టవర్లతోపాటు రోప్వేను కూడా నిర్మించనున్నారు. 37 ఎకరాలను పార్కింగ్, రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతికి, గ్రీనరీ కోసం వినియోగించనున్నారు. అనంతగిరి హిల్స్లోని అనంతపద్మనాభ స్వామి ఆలయం చుట్టూ సుందరీకరణతోపాటు పార్కింగ్ ఏరియా, లైటింగ్, వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టుల వద్ద కాటేజ్లు, రెస్టారెంట్లు, బోటింగ్, వాటర్ స్పోర్స్, ఆంఫిథియేటర్, రిసెప్షన్, ఆర్చ్లను ఏర్పాటు చేయనున్నారు.
-వికారాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అనంతగిరి టూరిజం అభివృద్ధికి సంబంధించి ఎల్అండ్టీ సంస్థ మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. 213 ఎకరాల్లో టూరిజం అభివృద్ధికిగాను మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. అనంతగిరి హిల్స్లోని టూరిజం అభివృద్ధికి గుర్తించిన 213 ఎకరాల్లో 177 ఎకరాల్లో ఎకో టూరిజంతోపాటు కన్వెన్షన్ సెంటర్, హోటల్, రిసార్ట్, కాటేజెస్, ఆంఫీ థియేటర్ పర్యాటకులను ఆకర్శించేందుకుగాను అటవీ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ను, శారీరక దృఢత్వానికి యోగా కేంద్రం, ధ్యాన కేంద్రం, స్పా, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేసేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. అనంతగిరి అటవీ ప్రాంతంలోని వివిధ రకాల పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్లను నిర్మించడంతోపాటు ట్రెక్కింగ్ను ఏర్పాటు చేయడంతోపాటు అనంతగిరి ప్రాంతాన్ని పూర్తిగా వీక్షించేందుకుగాను రోప్వేను కూడా నిర్మించేందుకు ప్లానింగ్ చేశారు. మరో 37 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతోపాటు రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతికి, గ్రీనరీని ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి హిల్స్లోని అనంతపద్మనాభ స్వామి ఆలయం చుట్టూ సుందరీకరణతోపాటు పార్కింగ్ ఏరియా, లైటింగ్, వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేలా ప్లానింగ్ చేశారు. కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లో కాటేజ్లతోపాటు రెస్టారెంట్లు, బోటింగ్, స్పీడ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, ఆంఫీథియేటర్, రిసెప్షన్, ఆర్చ్లను ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి హిల్స్తోపాటు కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లో టూరిజం అభివృద్ధికిగాను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రూ.70 కోట్లను ఖర్చు చేయనున్నాయి.
జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకుగాను అధికారులు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. 3600 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలోని 213 ఎకరాల్లో టూరిజం స్పాట్గా అభివృద్ధిలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఎల్అండ్టీ సంస్థ టూరిజం డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ను రూపొందించగా, వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి మాస్టర్ ప్లాన్ను అందజేయనున్నారు. మాస్టర్ ప్లాన్కు కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైన వెంటనే నిధులు మంజూరు కానున్నాయి. ఈ ప్రక్రియ అంతా రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నది. తదనంతరం టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నది.
హైదరాబాద్ నగరానికి సమీపంలో అనంతగిరి హిల్స్ ఉండడంతో వారాంతంలో అనంతగిరి హిల్స్లో పర్యాటకులు నిండిపోతున్నారు. అయితే జిల్లాకు వచ్చే పర్యాటకుల తాకిడికి సరిపోను సౌకర్యాలు ఎక్కడా లేకపోవడంతో పర్యాటకులను మరింత ఆకర్షించేలా అనంతగిరి ప్రాంతాన్ని టూరిజం హబ్గా సరికొత్తగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు. స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకుగాను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంపిక చేశాయి. రెండేండ్లలోగా అనంతగిరి హిల్స్, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు పర్యాటక ప్రదేశంగా మారనున్నాయి.
తెలంగాణ ఊటీగా పిలవబడుతున్న అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్ర రాజధానికి సమీపంలో కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సెలవులొస్తే చాలు నగరవాసులు అనంతగిరిలో వాలిపోతున్నారు. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో 4 నుంచి 5 వేల వరకు పర్యాటకులు జిల్లాలోని అనంతగిరి హిల్స్కు వస్తున్నారు. వారాంతపు సెలవుల్లో అనంతగిరి పర్యాటకులతో కిటకిటలాడుతున్నది. అనంతగిరిలోని ప్రసిద్ధ పద్మనాభస్వామిని దర్శించుకోవడంతోపాటు అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్లను చూసేందుకు, ట్రెక్కింగ్ చేసేందుకుగాను అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.
కెరెళ్లి వెళ్లే దారిలో నంది విగ్రహం, ఎత్తైన అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ పాల్స్ వద్ద పర్యాటకులు సేద తీరుతున్నారు. చాలా మంది పర్యాటకులు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా వస్తుంటారు. అనంతగిరికా హవా…లాకో రోగోంకా దవా(అనంతగిరి గాలి లక్ష రోగాలకు మందు) అని నానుడి కూడా ఉన్నది. అనంతగిరి అటవీ ప్రాంతాల్లోని వాతావరణంతోనే చాలా రోగాలు నయమవుతుంటాయి. సంబంధిత అటవీ ప్రాంతంలోని ఔషధ మొక్కలతో రోగాలు నయమవుతుంటాయన్న నమ్మకంతో కూడా చాలా మంది పర్యాటకులు అనంతగిరి కొండకు క్యూ కడుతున్నారు. మరోవైపు అనంతగిరి అడవుల్లో జింకలతోపాటు వందల రకాల పక్షులు, జంతువులతోపాటు వివిధ రకాల సీతాకోక చిలుకలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.