నవాబుపేట, ఏప్రిల్ 21 : నల్లగా నిగనిగలాడే పుచ్చకాయలు ఆరోగ్యానికి మంచివి అంటారు. ఎర్రటి రంగు కలిగి నల్లటి గింజలతో చూడగానే నోరూరించే పుచ్చపండు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వేసవి వచ్చిందటే దీనికి ఉండే డిమాండే వేరు.. సామాన్యులు సైతం కొనుక్కోగలిగే ధరల్లో ఇవి మనకు లభిస్తాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రజలు తమ దాహం తీర్చుకోవడానికి నానా తంటాలు పడుతూ వివిధ రకాలుగా తమ శరీరాన్ని చల్లబడేలా చూసుకుంటారు. అందులో భాగంగానే మనకు కాలనుగుణంగా వచ్చే పుచ్చకాయలు వేసవికాలంలో చాలానే దొరుకుతాయి. ఈ పంటను పండించడానికి 90 రోజుల గడువుతీసుకుని మార్కెట్లోకి తీసుకువస్తారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలును గడిస్తారు.
నవాబుపేట మండల పరిధిలోని ఆదర్శ గ్రామమైనా మీనపల్లి కలాన్లో రైతు తల్లారి యెసుదాస్ తమకున్న పొలంలోని ఎకరంన్నర భూమిలో పుచ్చకాయ పంట(ఉద్యాన పంట)ను పండిస్తున్నారు. తాను ఈ పంటకు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మొత్తం 90 రోజుల వ్యవధిలోనే చేతికి వచ్చి లాభాలను ఇస్తుందని దీంతో తమకు చేతినిండా పనిదొరుకుతున్నదన్నారు. విత్తనాలు తీసుకురావడానికి ఒక రూ.20 వేలు ఖర్చు కాగా, మరో రూ.20వేలు మందులకు, కూలీలకు కలిపి మొత్తం రూ.60వేలు ఖర్చు పెట్టి పంటతీస్తారు. కానీ పంట చేతికి వచ్చినప్పటినుంచి మూడు సార్లు తెంపుతారు వాటితో రాబడి మొత్తం దాదాపుగా రూ.2లక్షల పైచిలుకు దాకా వస్తుందన్నారు రైతు యేసుదాస్.
నేను పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నా. మాకు ఉన్న పొలంలో ఒక ఎకరాన్నర భూమిలో ప్రస్తుతం పుచ్చకాయ పంటను వేశాను. ఈ విత్తనం వేసిన దగ్గరనుంచి పంట చేతికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను మాత్రం వీటి ద్వారా అధిక లాభాలనే పొందుతున్నాను. పది, లేదా ఇరవై రూపాయలకు కిలో లెక్క అమ్ముతాము. పంటతో 90 రోజుల్లో రూ.2లక్షలు సంపదిస్తా.
– యేసుదాస్, రైతు