ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18 : రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. గడువు ముగిసేలోపు జిల్లాలోని 234 మద్యం దుకాణాలకు సుమారు 20వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని సరూర్నగర్, శంషాబాద్ డివిజన్లల్లో 234 మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తులు వ చ్చాయి. సరూర్నగర్ డివిజన్లో 9వేల పైచిలుకు, శంషాబాద్ డివిజన్లో 11వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా జిల్లా నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ.400 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అలాగే, జిల్లాలో అనేక మద్యం దుకాణాలకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చా యి. సుమారు 27 మద్యం దుకాణాలకు వందకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా సరూర్నగర్ డివిజన్ పరిధిలోని 27వ దుకాణానికి 159 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా పెరగడంతో ఈ దుకాణాలకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. జిల్లాలోని శివారు మండలాలైన సరూర్నగర్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు కొత్తూరు, ఆమనగల్లు, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో మద్యం షాపులకు ఎక్కువ మంది పోటీపడ్డారు. లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపు లు కేటాయిస్తుండడంతో ఎక్కువ దరఖాస్తులు వేయడానికే మొగ్గు చూపారు. రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాలో మ ద్యం షాపులకు అత్యధికంగా దరఖాస్తులు రావడం విశే షం. చివరిరోజైన శుక్రవారం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి ముందుకొచ్చారు. చివరిరోజు ఐదు గంటల గ డువు దాటినప్పటికీ దరఖాస్తు చేసుకోవడానికి క్యూలో వేచి ఉన్నారు.
క్యూలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు ఎక్సైజ్ సరూర్నగర్ డివిజన్ సూపరింటెండెంట్ రవీందర్రావు తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన వాటిని పరిశీలించి లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో..
జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ము గిసింది. మద్యం షాపుల టెండర్లకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా లో గతంలో ఎన్నడూ లేని విధంగా 2,595 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. అయితే దరఖాస్తు గడువుకు చివరి రెండు రోజులు అధిక మొత్తంలో టెండర్లు వేశారు. గురువారం 704 దరఖాస్తులు రాగా, ఆఖరి రోజైన శుక్రవారం 794 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ టెండర్లకు సంబంధించి పది రోజుల్లో వెయ్యి దరఖాస్తులు రాగా, కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 1,500 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. అయితే జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించగా శుక్రవారం ముగిసింది. జిల్లాలోని వికారాబాద్ డివిజన్లో అత్యధిక దరఖాస్తులు రాగా, కొడంగల్ డివిజన్లో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. అయితే మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులతో రూ.51.90 కోట్ల రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. మరోవైపు ఈనెల 21న లక్కీ డ్రా నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.
59 దుకాణాలకు 2,535 దరఖాస్తులు
జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు 2535 దరఖాస్తులు వచ్చాయి. అయితే తాండూరు డివిజన్లో 18 మద్యం దుకాణాలకు 576 దరఖాస్తులు, వికారాబాద్లో 15 దుకాణాలకు 854, మోమిన్పేటలో 6 దుకాణాలకు 335, పరిగిలో 12 షాపులకు 560, కొడంగల్ డివిజన్లో 8 మద్యం షాపులకు 270 దరఖాస్తులు వచ్చాయి. అయితే జిల్లావ్యాప్తంగా ఒక్కో మద్యం దుకాణానికి సగటున 40కిపైగా దరఖాస్తులు రాగా, అత్యధికంగా వికారాబాద్ డివిజన్లో ఒక్కో మద్యం దుకాణానికి 20 వరకు దరఖాస్తులు రావడం గమనార్హం. అలాగే ఆఖరి రోజు జిల్లా వ్యాప్తంగా 59 దుకాణాలకు 794 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా వికారాబాద్ డివిజన్లో 256, తాండూరులో 212, పరిగిలో 140, కొడంగల్ డివిజన్కు 106 దరఖాస్తులు, మోమిన్పేట డివిజన్లో 80 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు మోమిన్పేట డివిజన్లోని ఓ మద్యం దుకాణానికి జిల్లాలోనే అత్యధికంగా 80కి పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో క్యూలో నిల్చొని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు.