లోక్సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ పరిధిలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండగా, భువనగిరి ఎంపీ స్థానాన్ని ఒకసారి గెలుచుకోగా బీఆర్ఎస్కు గట్టి పట్టుండడంతో ఈ రెండు స్థానాలపై గులాబీ పార్టీ గురి పెట్టింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల వైఫల్యాలే ప్రచారస్త్రంగా మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ తాజా, మాజీ ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొని ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. మూడోసారి చేవెళ్ల ఎంపీ స్థానాన్ని దక్కించుకునేలా కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలపై గులాబీ పార్టీ గురి పెట్టింది. ఎలాగైనా ఈ స్థానాలను గెలుచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రాతినిథ్యం వహిస్తున్న మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 98వేల మెజార్టీ ఓట్లు పోలయ్యాయి. ఇదే జోరుతో చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. భువనగిరి లోక్సభ ఎన్నికల్లోనూ ఒకసారి బీఆర్ఎస్ గెలుపొందడంతో ఈ స్థానంపైనా బీఆర్ఎస్ గురిపెట్టింది. సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించి రంగారెడ్డి, వికారాబాద్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు.’
2009లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్సభ పరిధిలో ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఉన్న ఈ స్థానానికి ఇప్పటివరకు మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది. 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలుపొందిన గడ్డం రంజిత్రెడ్డి ఈసారి కూడా ఇదే స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ అనుకూల పరిస్థితుల్లో మరోసారి ఈ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్ చూస్తున్నది.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి పాగా వేయాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్న. 2009లో ఏర్పాటైన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరుగగా.. ఒకసారి బీఆర్ఎస్, రెండుసార్లు కాంగ్రెస్ గెలుపొందింది. ఈ పార్లమెంట్ పరిధిలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చెందిన భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్తోపాటు జనగామ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లు ఉన్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే దృష్టి పెట్టింది. బలమైన నేతను ఇక్కడి నుంచి బరిలో నిలిపేలా ఆలోచన చేస్తున్నది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసి ఆరు గ్యారెంటీల హామీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆచరణ సాధ్యం కాని హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ అపసోపాలు పడుతున్నది. రైతు బంధు సాయాన్ని సైతం రైతులకు అందజేయడంలో చతికిలపడింది. ఈ వైఫల్యాలనే జనాల్లోకి తీసుకెళ్లి తమకు అనుకూలంగా మల్చుకోవాలని బీఆర్ఎస్ సంకల్పిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పట్ల నేటికీ ప్రజల్లో ఆదరణ ఉన్నదని, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమవైపే ఉంటారన్న నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది.