కొడంగల్ : కిసాన్ క్రెడిల్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. అనిల్కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పశువైద్యశాల కార్యాలయంలోని సమావేశపు హాల్లో కిసాన్ క్రెడిట్ కార్డుల వినియోగం, లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి రైతులకు, మత్స్యకారులకు రుణాలను అందిస్తు ఆయా రంగాల అభ్యున్నతికీ ప్రభుత్వం పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతులకు పది గుంటల పొలం నుంచి రెండు, మూడు ఎకరాల పొలం ఉన్న ఒక్కో రైతుకు రూ. 1.60లక్షల రుణం సదుపాయాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.
ఇది వరకే పంట రుణాలను అందుకున్న రైతులు, ఈ రుణాలు అందుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. దరఖాస్తులో పొలం, సర్వే నంబరు, విస్తీర్ణం, ఆధార్కార్డు నంబరు తదితర వివరాలను పొందుపరచాలని సూచించారు. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ పథకం ద్వారా రైతులకు రూ. 50లక్షల రుణాలను అందిస్తున్నమని, దీనిలో 50శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. యువ రైతులు, స్వయం సహాయక సంఘాలు ఈ రుణాలను పొందడానికి ముందుకు రావాలని కోరారు. కేసీసీ రుణాలు మార్చి వరకు తీసుకోవాలని తెలిపారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా రుణాన్ని చెల్లిస్తే వడ్డీ భారం తగ్గి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
అదే విధంగా ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులకు సరైన అవకాశాలు లేని కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, పాల శీతలీకరణ, పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండి ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, పశువైద్యాధికారి ఏడీ డా. నోవా, డా. పరమేశ్, వెటర్నరీ అసిస్టెంట్ ఉషారావుతో పాటు రైతులు పాల్గొన్నారు.