కేశంపేట : గ్రామాల్లో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులందరం సమన్వయంతో పని చేద్దామని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరు, దేవునిగుడితండా, ఇప్పలపల్లి, తూర్పుగడ్డతండా, పాపిరెడ్డిగూడలో ఆదివారం ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ నిధులతో నిర్మించతలపెట్టిన సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పల్లె, పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని, పల్లెల అభివృద్ధికి పల్లెప్రగతి, పట్టణాల అభివృద్ధికి పట్టణప్రగతి కార్యక్రమాలతో పురోగతి సాధించామని తెలిపారు.
కేశంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ, గ్రామ పంచాయతీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు నిర్మించి, రోడ్లకు ఇరువైపుల పచ్చని చెట్లతో అందంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఇప్పటికే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందుతుండటంతో ఇక తాగునీటి సమస్య తీరి ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేను ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్లు గండ్ర లక్ష్మమ్మ, శంకర్నాయక్, లలిత, ఆంజనేయులు, విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ విశాల, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, ఎంపీటీసీలు రమాదేవి, మల్లేష్యాదవ్, మండల కో-ఆప్షన్ జమాల్ఖాన్, ఎంపీడీవో రవిచంద్రకుమార్రెడ్డి, పీఆర్ఏఈ భూపాల్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణగౌడ్, పర్వత్రెడ్డి పాల్గొన్నారు.