షాబాద్, జనవరి 31: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఇంటి వెలుగులా మారుతున్నది. మంగళవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 17,333 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. వంద రోజులపాటు నిర్వహించే ఈ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. షాబాద్ మండలంలోని హైతాబాద్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు సందర్శించారు.
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 17,333 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,810 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 2,644 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గ్రామాలవారీగా కేటాయించిన రోజుల్లో ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందించి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన అద్దాలను వైద్యసిబ్బంది పంపిణీ చేస్తున్నారు. పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను డాటా ఏంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడూ ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు.
వైద్య శిబిరాలకు విశేష స్పందన
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లాలో 6195 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1073 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 618 మందికి అద్దాలకు ఆర్డరిచ్చారు. ఆర్థిక స్థోమత లేక వైద్య పరీక్షలు నిర్వహించుకోలేని నిరుపేదల్లో కంటి వెలుగు ధైర్యం నింపుతున్నది.
కంటి వెలుగు పేదలకు ఎంతో ఉపయోగం
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. గతంలో కంటి సమస్యలతో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నో ప్రైవేట్ దవాఖానలు తిరిగినా సమస్య తీరేది కాదు. సీఎం కేసీఆర్ ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించేందుకు క్యాంపులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
– యాదయ్య, అప్పారెడ్డిగూడ(షాబాద్)
ప్రభుత్వం నిర్ణయం ఎంతో బాగుంది
పేద ప్రజలందరికీ కంటి పరీక్షలు చేయించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం ఎంతో బాగుంది. మా గ్రామంలో నిర్వహిస్తున్న క్యాంపులో నేను కంటి పరీక్షలు చేయించుకున్నాను. పరీక్షలు చేసిన అనంతరం ఉచితంగా అద్దాలతో పాటు మందులు అందజేశారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం గొప్ప పరిణామం.
– యాదగిరిగౌడ్, మన్మర్రి(షాబాద్)
వెలుగులు నింపుతున్న కంటి వెలుగు శిబిరాలు
ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాలను గ్రామాల్లో నిర్వహించి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అక్కడే అద్దాలు అందజేయడమనేది నిరుపేదలకు వరంలా తలపిస్తున్నది. పేదల అభ్యున్నతి కోసం తీసుకువచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి పేదలను ఆదుకోవాలి. కంటి వెలుగు శిబిరాలు నిరుపేదల కండ్లల్లో వెలుగులు నింపుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
– రేఖ్యానాయక్, బొంపల్లి చిన్నతండా, దోమ