కులకచర్ల : రాష్ట్ర స్థాయిలో జూనియర్ ఖోఖో జట్టులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో జూనియర్ ఖోఖో బాలురు, బాలికలు సిద్దిపేట్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థాయిలో నిలువడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్య సాధన కోసం క్రీడకారులు కృషి చేయాలని దీని వలన మంచి గుర్తింపు వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి పీడీ సుభాష్నాయక్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిభను చాటేందుకు ముందుకు వస్తున్నారన్నారు. సుభాష్ నాయక్ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిభను కనబర్చిన విద్యార్థులను అభినందించారు.