షాబాద్, మే 23: జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని షాబాద్, రేగడిదోస్వాడ పశువైద్యాధికారులు స్రవంతి, చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కుమ్మరిగూడ, కక్కులూర్, హైతాబాద్, రేగడిదోస్వాడ తదితర గ్రామాల్లో సిబ్బందితో కలిసి జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…గొర్రెలు, మేకలు పోషించుకునే జీవనం సాగించే వారికి మంచి ఆదాయం వస్తుందని తెలిపారు. జీవాలకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి తమకు సమాచారం అందించాలని సూచించారు.
పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది రాణి, శ్రీను, కృష్ణమూర్తి, సుధాకర్, సాగర్, రైతులు తదితరులున్నారు.
మొయినాబాద్ : జీవాలకు చిటిక వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని పశువైద్యాధికారి దేవీరెడ్డి అన్నారు. మండల పరిధిలోని అమ్డాపూర్లో గురువారం 800 జీవాలకు చిటిక వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలం ఆరంభంలో మొలకెత్తే గడ్డిని తినడంతో ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. రోగ నిరోధక శక్తి పెరగడానికి తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలన్నారు.