సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): ఇన్సులిన్ మందుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొర డా ఝళిపిస్తున్నారు. నగరంలోని ఆరు మెడికల్ ఏజెన్సీల లైసెన్స్లను నెల రోజలపాటు సస్పెండ్ చేశారు. అంతేకా కుండా వారి నుంచి రూ. 51. 92 లక్షల విలువైన ఇన్సులిన్ మందులను సీజ్ చేశారు. డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్రెడ్డి కథనం ప్రకారం.. నగరంలో పలు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు పోటీపడి..40 శాతానికి పైగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన డీసీఏ అధికారులు.. మార్చి 15 నుంచి నగరంలోని పలు మెడికల్ ఏజెన్సీలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని ఆ రు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లపై దాడులు జరిపి, సేల్బిల్స్ను పరిశీలించగా, వాటికి కొనుగోలు చేసిన బిల్లుల్లేవని తేలింది. అంతేకాకుండా ఈ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఢిల్లీ నుంచి ఎలాంటి బిల్లుల్లేకుండా తక్కువ ధరకు ఇన్సులిన్ ఇంజెక్షన్లను కొని నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది.
డీసీఏ నిబంధనల ప్రకారం బిల్లుల్లేకుండా ఔషధాలను కొనడం డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్చట్టం 1940 ప్రకారం నేరం. ఇలాంటి మందులు వాడటం రోగులకూ ప్రమాదకరమే. కొన్ని రోజులుగా నగరంలోని మెడికల్ డిస్ట్రిబ్యూటర్లపై నిఘా పెట్టగా, ఆరుగురు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు అనధికారికంగా ఢిల్లీ నుంచి తక్కువ ధరకు ఇన్సులిన్ ఇంజెక్షన్లను బిల్లుల్లేకుండా కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ మేర కు సోమవారం సికింద్రాబాద్, పద్మారావునగర్లోని డ్రగ్ హబ్పై దాడులు జరిపి, 6.70 లక్షల విలువైన ఇన్సులిన్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. ఉప్పల్, రామంతాపూర్లోని శ్రీతిరుమల ఫార్మాపై దాడులు జరిపి రూ. 3.52 లక్షల విలువ చేసే ఇన్సులిన్ను, సుల్తాన్బజార్లోని శ్రీ పరాస్ మెడికల్ ఏజెన్సీపై దాడులు జరిపి రూ.9 లక్షల విలువ చేసే ఇన్సులిన్, నాగోల్, సాయినగర్లోని శ్రీగణేశ్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి రూ.14.లక్షల విలువ చేసే ఇన్సులిన్, కాప్రాలోని శ్రీరాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి రూ. 2.70 లక్షల విలువైన ఇన్సులిన్ను, కాచిగూడలోని శ్రీబాలాజీ ఏజెన్సీ నుంచి రూ.16 లక్షల విలువైన ఇన్సులిన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.