పెద్దేముల్ : ఎక్సైజ్ ఎస్ఐతోపాటు ఇతర ఎక్సైజ్ పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన నేపధ్యంలో మండల పరిధిలోని పాషాపూర్ గ్రామ సర్పంచ్ భరత్కుమార్పై కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్ఐ నాగరాజు శనివారం తెలిపారు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న శుక్రవారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో తాండూరు ఎక్సైజ్ ఎస్ఐ సైదయ్య, తన సిబ్బందితో కలిసి మండల పరిధిలోని పాషాపూర్ గ్రామానికి తనిఖీల్లో భాగంగా వెళ్లడం జరిగింది. కాగా గ్రామ సర్పంచ్ భరత్ కుమార్, మరికొందరు కలిసి తాండూరు ఎక్సైజ్ ఎస్ఐ సైదయ్య, సిబ్బందికి విధులకు ఆటంకం కలిగించి అడ్డగించారు. ఈ విషయమై ఎస్ఐ సైదయ్య శనివారం పెద్దేముల్ పోలీసు స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా సర్పంచ్ భరత్ కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు.