వికారాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 212 కేంద్రాలుండగా.. 1,45,544 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నీడలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కనీస మౌలిక వసతులను కల్పించారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఆత్మైస్థెర్యంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 17,888 మంది ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జనరల్ విద్యార్థులు 15,297 మందికాగా, ఒకేషనల్కు సంబంధించి 2591 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, వికారాబాద్లోని సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల, ఒక మోడల్ స్కూల్, పరిగి, కొత్తగడిలోని రెసిడెన్షియల్ కాలేజీల్లో, మిగతా 15 పరీక్షా కేంద్రాలను ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేశారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు 14416 టోల్ ఫ్రీ నంబర్తోపాటు 9642831424, 9963356062లను ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను అనుమతిస్తారని, ఉదయం 8.45 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.
ప్రశ్నాపత్రాల నిల్వకు 10 స్టోర్ పాయింట్లు
జిల్లాలో ప్రశ్నాపత్రాలను నిల్వ చేయడంతోపాటు ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు 10 స్టోర్ పాయింట్లను ఏర్పాటు చేశారు. తాండూరు, వికారాబాద్, పరిగి, మర్పల్లి, కులకచర్ల, దోమ, నవాబుపేట, మోమిన్పేట, కొడంగల్, పెద్దేముల్ల్లో ప్రశ్నాపత్రాలను భద్రపరిచారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున ఇన్విజిలేటర్లను, లెక్చరర్, రెవెన్యూ, పోలీస్ శాఖతోపాటు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్కాడ్ బృందం, నలుగురు సభ్యులతో కూడిన రెండు సిట్టింగ్ బృందాలను పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు నియమించారు. గతేడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 67 శాతం ఉత్తీర్ణతరాగా.. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని 80 శాతానికి పెంచేందుకు సంబంధిత అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న దృష్ట్యా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తప్పక పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి జరుగనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిర్ణీత సమయంలోగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. మాస్ కాపీయింగ్ జరుగకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఒత్తిడికి గురికుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 80 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకనుగుణంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం.
– శంకర్నాయక్, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి
అన్ని రకాలుగా వసతుల కల్పన
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుపర్చుతున్నాం. తగిన పోలీసు బందోబస్తుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. పరీక్షా సమయాలకనుకూలంగా అన్ని రూట్లలో విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశాం. పరీక్షలు కొనసాగే సమయాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం తలెత్తకుండా ట్రాన్స్కో అధికారులతో సంప్రదించి జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నాం. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం నం.8978158484ను ఏర్పాటు చేశాం.
– హరీశ్, రంగారెడ్డి కలెక్టర్
పరీక్షలు సజావుగా జరిగేందుకు 4 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ టీములు
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో డీఐఈవో వెంక్యానాయక్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ ఇప్పటికే సిద్ధం చేశారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 15 – ఏప్రిల్ 3, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 – ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. ఇవే పరీక్షల తేదీలు, జనరల్, ఒకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తాయని ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. జిల్లావ్యాప్తంగా 182 పరీక్షా కేంద్రాల్లో 1,27,656 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 71,773 మంది ప్రథమ సంవత్సరం, 55,883 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి ఒక ఏఎన్ఎంను అందుబాటులో ఉంచుతూ వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లకు డ్యూటీలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలకు 31 ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉన్నాయి. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీములు పరీక్షల పకడ్బందీ నిర్వహణకు తోడ్పడనున్నాయి. ఇంటర్ బోర్డు బృందాలు కూడా ఈ పరీక్షలపై దృష్టి సారించనున్నారు.