షాద్నగర్టౌన్, మార్చి 14: ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక వసతులను సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతి లేదనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సంబంధితశాఖ అధికారులు సూచిస్తున్నారు. షాద్నగర్ పట్టణంలో మొత్తం 7పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 2210మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, ఒకేషనల్ 590 మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 509 మంది, మొగిలిగిద్ద జూనియర్ కళాశాలలో 224 మంది, ప్రతిభ జూనియర్ కళాశాలలో 361 మంది, విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విద్యార్థులు 590 మంది, విజేత జూనియర్ కళాశాలలో 366 మంది, విశ్వభారతి కళాశాలలో 518 మంది, శ్రీసాయి ఒకేషనల్ కళాశాలలో 232 మంది పరీక్ష రాయనున్నట్లు కస్టోడియన్లు వి. శ్రీకాంత్, కిష్టప్ప తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర పేపర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లేందుకు వీలు లేదన్నారు.