షాబాద్, జూన్ 12 : బసవేశ్వరుడు.. ఆదర్శప్రాయుడని, సమాజంలో కుల వ్యవస్థను వర్ణబేధాలను లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి అని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలో బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేవెళ్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు అభినవ మండపం ఏర్పాటు చేసి స్త్రీలు, పురుషులకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేశాడన్నారు. ఆనాడే హరిజనులకు ఆలయ ప్రవేశం, సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారన్నారు. అలాంటి మహానీయుడు సూచించిన మార్గంలోనే అందరూ నడుచుకోవాలని సూచించారు. సమ సమాజ స్థాపనకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. అప్పట్లో నెలకొన్న మత విలువలను సంస్కరించడమే కాకుండా సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన బసవేశ్వరుడు సామాజిక దార్శనికుడని వారు కొనియాడారు. హైదరాబాద్లో బసవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10కోట్లు నిధులు కేటాయించినదని చెప్పారు. భవిష్యత్ తరాలకు బసవేశ్వరుడి స్ఫూర్తిని కొనసాగించేందుకు చిహ్నంగా ట్యాంక్బండ్పై బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు.
బసవేశ్వరుడి ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్
ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ మాట్లాడుతూ…కులమతాలకు అతీతంగా ప్రజలంతా సమానమేనన్న బసవేశ్వరుడి దార్శనికతను ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. దళిత, వెనుకబడిన కులాలు, గిరిజనులు, మహిళల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తూ బసవేశ్వరుడి ఆశయాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. బసవేశ్వరుడి జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిసూ, వారి ఆశయాల సాధన దిశగా కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్కుమార్, షాబాద్ సర్పంచ్ తమ్మలి సుబ్రహ్మాణేశ్వరి, వైస్ ఎంపీపీ జడల లక్ష్మీరాజేందర్గౌడ్, ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, మాజీ ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతీరవికుమార్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్రెడ్డి, బసవేశ్వర సంఘం సభ్యులు ఏగూరి లింగప్ప, శ్రీకరప్ప, మల్లికార్జున్, రవీందర్, శ్రీను, ప్రదీప్, నవీన్, పర్షావేది, రవికుమార్, ప్రవీణ్, శేఖర్, సంతోశ్, సందీప్, రవి, విశ్వనాథ్, రమేశ్, దీపక్, సర్వేష్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.