ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. పనిదినాలు కల్పించడంలో జిల్లా ముందంజలో నిలిచినా పూర్తిస్థాయిలో జాబ్కార్డులున్న కూలీలందరికీ జిల్లా యంత్రాంగం పని కల్పించలేకపోయింది. గత డిసెంబర్ నెలాఖరు వరకు 54,95,230 పనిదినాలు కల్పించాల్సి ఉండగా, 48,66,752(89శాతం) పనిదినాలను మాత్రమే కల్పించారు. ఇప్పటివరకు కూలీలకు రూ.90.45 కోట్లను చెల్లించారు.
ఈ యాసంగి సీజన్లో వ్యవసాయ పనులు అంతగా ఉండవు కాబట్టి, పని లేక కూలీలు దిగులుచెందుతున్నారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు శాపంగా మారుతున్నాయి. జాబ్కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయడంతో కూలీలకు ఇబ్బందిగా మారింది. మరోవైపు ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు పని ఫొటోలను అప్లోడ్ చేయాలనడం ఇబ్బందికరంగా తయారైంది. కేంద్రం పెట్టే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. జిల్లాలో 1,82,794 జాబ్కార్డులు ఉండగా, 3,76,101 మంది కూలీలు ఉన్నారు.
– పరిగి, జనవరి 5
పరిగి, జనవరి 5: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కూలీలకు పని కల్పించడంలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. గత కొన్ని ఏండ్లుగా కూలీలకు పని కల్పించడంలో వికారాబాద్ జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూ వస్తుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 1,82,794 ఉపాధిహామీ జాబ్కార్డులు ఉండగా, ఆయా కుటుంబాల్లో 3,76,101 మంది కూలీలు ఉన్నారు. జిల్లా పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు రూ.170 కోట్ల విలువ చేసే 62,83,158 పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఇందులో భాగంగా ఉపాధిహామీ పథకం కింద ఫారమ్ పాండ్ల నిర్మాణం, భూమి చదును చేసే పనులు, హరితహారం కింద మొక్కల పెంపకానికి గుంతలు తవ్వడం, ఇతర పనులు చేపట్టడం జరిగింది.
జిల్లా పరిధిలో గత డిసెంబర్ నెలాఖరు వరకు 54,95,230 పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించగా 48,66,752 (89శాతం) పనిదినాలను కూలీలకు కల్పించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1979 కుటుంబాలు వంద పనిదినాల కంటే అధికంగా పనిచేశారు. ఇప్పటివరకు జిల్లా పరిధిలో జరిగిన ఉపాధిహామీ పనులకు సంబంధించి మొత్తం రూ.90.45 కోట్లు చెల్లించారు. ఉపాధిహామీ కూలీకి రోజుకు రూ.272 చెల్లించాల్సి ఉండగా వారు చేసిన పనికి సంబంధించిన వరకు చెల్లింపులు చేపడతారు. ఇప్పటివరకు చెల్లింపులు పోను సుమారు రూ.రెండు కోట్ల వరకు కూలీ డబ్బులు రావాల్సి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, వికారాబాద్ జిల్లా ఉపాధిహామీ కూలీలకు పని కల్పించడంలో 3వ స్థానంలో నిలవగా, వంద రోజులు పని కల్పించడంలో 6వ స్థానంలో నిలిచింది.
ఉపాధిహామీ పనులకు సంబంధించి కూలీలకు పని కల్పించడంలో పెద్దేముల్ మండలం నిర్దేశించిన లక్ష్యం కంటే అధికంగా పని కల్పించడం ద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో మొదటి స్థానంలో నిలిచింది. పెద్దేముల్ మండలానికి సంబంధించి డిసెంబర్ వరకు 3,63,153 పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటివరకు 3,71,590 పనిదినాలు కల్పించడం ద్వారా జిల్లాలోనే అగ్రభాగంలో నిలిచింది. మండలంలో వంద రోజులు పని పూర్తి చేసిన 64 కుటుంబాల కూలీలకు రూ.6.73 కోట్లు చెల్లించారు. జిల్లాలో అత్యధికంగా నవాబుపేట్ మండలంలో 332 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించారు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా కూలీల జాబ్కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయడంతో కూలీలకు ఇబ్బందిగా మారింది. ఆధార్కార్డు అనుసంధానం ఉంటేనే కూలీ పనికి రావాలని, లేదంటే రావద్దని సూచిస్తుండడం గమనార్హం. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కూలీల పాలిట శాపం గా మారిందని చెప్పవచ్చు. మరోవైపు పనిచేస్తున్న చోట ఉద యం, మధ్యాహ్నం రెండుసార్లు ఫోటోలు అప్లోడ్ చేయాలనడం సైతం ఇబ్బందికరంగా తయారైంది. త్వరలోనే ఫేస్మాస్క్ పేరిట ప్రతి ఒక్కరి ఫోటోలు అప్లోడ్ చేయాలనే నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది. కొత్త నిబంధన అమలులోకి వస్తే కూలీలకు మరింత ఇబ్బంది కలుగుతుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం రోజుకు 3,802 మంది కూలీలు పనికి వస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ప్రారంభమై, మార్చి, ఏప్రిల్, జూన్లలో పనులు ముమ్మరంగా కొనసాగుతాయి.