సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : కూరగాయల సాగులో నూతన విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇక్రిసాట్ కృషి చేస్తోంది. అధిక దిగుబడి పొందడంతో పాటు, చీడపీడల నియంత్రణకు అవకాశం ఉన్న విధానాలపై అధ్యయనం చేస్తుండగా…గ్రాఫ్టింగ్(అంటు కట్టడం) ప్రక్రియతో మెరుగైన ఫలితాలు సాధ్యమేనని చెబుతోంది. ప్రయోగాత్మకంగా అంటు కట్టడంపై ఇక్రిసాట్ సాగు పద్ధతులను పరిశీలిస్తుండగా త్వరలో రైతులు వినియోగించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నది. ఆధునిక సాగు విధానాలతో ఆహార పంటల ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఇక్రిసాట్ గ్రాఫ్టింగ్ పద్ధతిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మెరుగుపడేలా సాగు విధానాలను రూపొందిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగానికి అధిక దిగుబడి, తెగుళ్ల నియంత్రణ అనేవి పెను సవాలుగా మారాయి. పెరుగుతున్న జనాభా, వాతావరణంలో మార్పులు మరింత అనుగుణంగా ఆహార ఉత్పత్తులను పెంచేందుకు అంటు కట్టే విధానాలతోనే సాధ్యమని పరిశోధకులు చెబుతున్నారు.
కొత్తేమీ కాదు..
పూల మొక్కల విషయంలో అంటు విధానం వినియోగం అధికంగా ఉంది. ఒకే జాతి మొక్కలకు పలు రూపాల్లో ఉండే పూలు పూసేలా గ్రాఫ్టింగ్ చేసేవారు. అదే తరహాలో కూరగాయల సాగులోనూ గ్రాఫ్టింగ్ విధానాన్ని అమలు చేస్తే విత్తన సేకరణ సమస్య తప్పుతోంది. అదేవిధంగా అంటు కట్టడం వల్ల కూరగాయల మొక్కలకు సోకే తెగుళ్ల బెడద తగ్గుతుందని చెబుతున్నారు. మొక్కల ఆయువు పెరగడంతోపాటు దిగుబడి అధికంగా రావడంతో పాటు కూరగాయల రైతులకు నష్టాలను తగ్గిస్తుంది. వెజిటబుల్ గ్రాఫ్టింగ్ పరిశోధనలో భాగంగా టమాటా, మిరప మొకలపై దృష్టి కేంద్రీకరించింది. క్యాప్సికమ్, బెండకాయ, చేదు పొట్లకాయ, పాము పొట్లకాయ, గుమ్మడికాయ సాగుపై పరీక్షిస్తున్నారు. ఈ రంగంలో మరింత లోతైన అధ్యయనం చేస్తున్న ఇక్రిసాట్ స్టార్టప్లను మరింతగా ప్రోత్సహిస్తున్నది. కూరగాయలను మాత్రమే ఈ అంటు కట్టడం విధానంలో డెవలప్ చేసేందుకు కృషి చేస్తోంది.