ఇబ్రహీంపట్నం : ఆడపడుచులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటూ పండుగ పర్వదినాన కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సంక్షేమ కార్యక్రమాల్లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడపడుచులకు పెద్దపీఠ వేసిందని, అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించిందన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోటిమంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ అని దీనిని దృష్టిలో ఉంచుకు ని ప్రభుత్వం బతుకమ్మ పండుగను కూడా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అర్హులైన మహిళలందరూ సంబంధిత కేంద్రాల వద్దకు వెల్లి ఆధార్కార్డు చూపించి చీరలను పొందాలన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, పెద్దఅంబర్పేట్ మున్సిపల్ వైస్ చైర్మన్ సిద్దంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.