ఇబ్రహీంపట్నం : ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల ఉమ్మడి భాగస్వామ్యంతోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి పరిధిలోని నాగన్పల్లి రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న తాసీల్దార్ కార్యాలయం భవన నిర్మాణ స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మీదుగా రూ. 28కోట్ల వ్యయంతో అనాజ్పూర్ వరకు నిర్మించతలపెట్టిన డబుల్రోడ్డు విస్తరణ పనులు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నివాసగృహాలు కోల్పోతున్న వారికి నష్టం జరుగకుండా రోడ్డును కుదించి నిర్మించేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆయన ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.
అయినప్పటికీ కొంతమేర నష్టపోయేవారికి తగు విధంగా అండగా ఉంటామని చెప్పారు. ఇబ్రహీంపట్నం నాగన్పల్లి రోడ్డు విస్తరణతో పాత ఇబ్రహీంపట్నం కళకళలాడుతుందన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున రహదారుల విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంకు విజయవాడ, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర రహదారులను అనుసంధానం చేసేందుకుగానూ ఇప్పటికే కోట్లాది రూపాయలతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఇబ్రహీంపట్నం అనాజ్పూర్ రోడ్డు విస్తరణ పూర్తయితే ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ రహదారికి రవాణ వ్యవస్థ మరింత పెరుగుతుందన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం ఉన్న తాహసీల్దార్ కార్యాలయం శిథిలాస్థకు చేరిందని దీని స్థానంలో రూ. 1.50కోట్లతో నూతన భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పాత భవనాన్ని కూల్చివేసి నూతన భవనం నిర్మించడానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే దాతల సహకారంతో ఇబ్రహీంపట్నంలో ఆర్డీఓ కార్యాలయం నూతన భవనం, అబ్దుల్లాపూర్మెట్ నూతన తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. ఇబ్రహీంపట్నంలో సబ్రిజిస్టార్ కార్యాలయానికి సొంత భవనం లేదని ఈ భవన నిర్మాణం కూడా నిర్మించడానికి నిధులు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, ఆకుల యాదగిరి, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, తాసీల్దార్ అనిత, ఆర్అండ్బీ ఈఈ శ్రవణ్ప్రకాశ్, డీఈ వేణుగోపాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యూసఫ్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, కార్యదర్శి వేణుగోపాల్రావు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.