Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాసాల బలపరీక్ష పూర్తైంది. కాగా, ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం సహకార సంఘం చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్గా ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన టేకుల సుదర్శన్రెడ్డి కొనసాగుతున్నారు. ఈ సహకార సంఘం పరిధిలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా చైర్మన్, వైస్చైర్మన్ మినహా 11మంది డైరెక్టర్లు చైర్మన్, వైస్చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సహకార సంఘంలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ పలువురు డైరెక్టర్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పాండురంగారెడ్డి 11మంది డైరెక్టర్లతో కలిసి చైర్మన్, వైస్చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ఈనెల 22న బలపరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన పాండురంగారెడ్డి 11మంది డైరెక్టర్లతో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. అలాగే, అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బాటసింగారం సహకార సంఘం చైర్మన్ఫై కూడా కాంగ్రెస్ మద్దతుతో సొంత పార్టీ వారే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సహకార సంఘం పరిధిలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా.. ఒక డైరెక్టర్ అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రస్తుతం 12 మంది డైరెక్టర్లులు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్కు చెందిన ఇద్దరితో కలిపి మరో ఏడుగురు బీఆర్ఎస్ సానుకూల డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో చైర్మన్కు వ్యతిరేకంగా 9 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానంపై ఈనెల 28న బలపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చైర్మన్ వ్యతిరేకవర్గం డైరెక్టర్లు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ రెండు సహకార సంఘాల చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు చర్చనీయాంశంగా మారాయి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం బలపరీక్షలో చైర్పర్సన్ ఓడిపోయారు. ఇదే మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మర్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 13 మంది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈనెల 9న నిర్వహించిన బలపరీక్షలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్పర్సన్ ఓడిపోయారు. సొంత పార్టీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్న అభియోగంపై నిరంజన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఆదిబట్ల మున్సిపాలిటీ నూతన చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లయితే నిరంజన్రెడ్డి చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన నిరంజన్రెడ్డిని చైర్మన్గా ఎన్నుకోకుండా ఆయన వ్యతిరేక వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నది. బలపరీక్ష పూర్తై 15 రోజులు దాటినప్పటికీ నూతన చైర్మన్ ఎన్నిక కోసం గడువు ఇవ్వడం లేదు. దీంతో చైర్మన్ ఎన్నికకు సంబంధించి గడువు ఇస్తారా.. లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. కాగా, ఇబ్రహీంపట్నం చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.