షాబాద్, మే 24: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని చేవెళ్ల డివిజన్ ఉద్యానవనశాఖ అధికారి వి. అశోక్యాదవ్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి రైతువేదికలో ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగు చేయడం వల్ల కలిగి ప్రయోజనాలు, లాభాలు, మిగతా పంటలతో పోల్చినప్పుడు ఆయిల్పామ్ పంట వేయడం వల్ల ఉపయోగాలు తదితర అంశాలపై రైతులకు క్లుప్తంగా వివరించారు.
ఆయిల్పామ్కు సంబంధించి అనుకూల నేలలు, నీటి లభ్యత, నాటే విధానం, సాగునీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం, అంతరపంటలు, గెలల దిగుబడి, కోతలకు సంబంధించిన వివరాలపై రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. నీరు తేలికగా ఇంకిపోయే గుణం ఉన్న నేలలు దీనికి అనుకూలంగా ఉంటుందని, సాగునీరు సమృద్ధిగా ఉండాలని చెప్పారు. త్రిభుజాకార పద్ధతిలో మొక్కలు నాటుకోవాలని, గుంతలో 400 గ్రాముల ఎస్ఎస్పీ, 200 గ్రాముల డీఏపీ, 50 గ్రాముల ఫోరేట్ వేసి మట్టితో నింపాలన్నారు.
నాటిన తొలి మూడు సంవత్సరాల్లో అంతరపంటలు వేసుకోవచ్చని తెలిపారు. దిగుబడి 3-4 సంవత్సరాల మధ్య ప్రారంభమై, 25-30 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చని చెప్పారు. ఆయిల్పామ్ సాగులో రైతులకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయిల్పామ్ ఫీల్డ్ ఆఫీసర్, వ్యవసాయశాఖ ఏఈవో, హార్టికల్చర్ ఆఫీసర్లు వద్ద దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో గీత, వాల్యూ ఆయిల్పామ్, గ్యాస్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ రాకేశ్, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.