రంగారెడ్డి, మే 21 (నమస్తే తెలంగాణ) : వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులపై ఎరువుల ధరల పెంపు మరో పిడుగులా మారింది. యాసంగి సీజన్ ముగిసి వానకాలం సీజన్ పంటల కోసం అన్నదాతలు సిద్ధమవుతున్న వేళ ఎరువుల ధరల పెంపుతో రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు అకాల వర్షాలు.. మరోవైపు యాసంగి పంటలు ప్రభుత్వం సకాలంలో కొనకపోవడంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి కష్టాల నుంచి బయటపడి వానకాలం సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఎరువుల ధరలు తీవ్రంగా కుంగదీస్తున్నాయి. గత వానకాలం సీజన్ నుంచి ఇప్పటి వరకు సుమారు ఏడాది కాలంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు ఏకంగా నాలుగుసార్లు పెంచాయి. తొలకరి వర్షాలు కురిసే నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేద్దామనుకుంటున్న అన్నదాతలకు పెరిగిన ఎరువుల ధరలు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఆయా ఎరువుల కంపెనీలు పెరిగిన ధరలపై ఇప్పటికే డీలర్లకు సమాచారమందించారు. వివిధ రకాల ఎరువులను బట్టి ఒక్కో బస్తాపై సుమారు రూ.150 నుంచి రూ.400 వరకు పెరగడంతో రైతులు షాక్కు గురవుతున్నారు. యూరియా, డీఏపీ తర్వాత అన్నదాతలు ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తారు. కాంప్లెక్స్ ఎరువులతోపాటు పొటాష్ వంటి వాటి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వచ్చే వానకాలం సీజన్ నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులతో తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉన్న రైతులకు ఎరువుల ధరల పెంపు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అయింది.
రంగారెడ్డిజిల్లాలో గత యాసంగి సీజన్లో సుమారు 29వేల మెట్రిక్ టన్నుల యూరియాను అన్నదాతలు వినియోగించారు. డీఏపీ, పొటాష్, సూపర్ ఫాస్పే, 14.35.14తోపాటు వివిధ రకాల ఎరువులు రైతులు వాడుతున్నారు. గత యాసంగి సీజన్లో జిల్లాలో 1.40లక్షల ఎకరాల్లో వరి పంట వేసారు. ఈ వర్షాకాలం సీజన్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేస్తున్నారు. పత్తి పంట గత సీజన్లో 1.65లక్షల ఎకరాల్లో సాగుచేశారు. 40వేల ఎకరాల్లో మొక్కజొన్నతోపాటు 20వేల ఎకరాల్లో కూరగాయ తోటలు వేసారు.
ఇప్పటికే యూరియా కొరత అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూరియా కోసం రైతులు రోజుల తరబడి సహకార సంఘాల ఎదుట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత యాసంగి సీజన్లో జల్లాలో సుమారు 40వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అవసరముండగా.. ప్రభుత్వం కేవలం 29వేల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేసింది. వానకాలం సీజన్లో కూడా యూరియా కొరత అన్నదాతలను మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే వ్యవసాయరంగంలో పెరిగిన యాంత్రీకరణ ధరలు, కూలీ రేట్లతో అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీనికితోడు పెరిగిన ఎరువుల ధరలు రైతులకు మరింత భారం కానున్నాయి.
రెండేళ్లుగా అన్నదాతలకు సక్రమంగా యూరియా దొరకడంలేదు. అధికారులను అడిగితే యాప్లో బుక్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. యూరియా దొరకక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రభుత్వం మరోమారు ఎరువుల ధరలను పెంచడం దారుణం. ఇప్పటికే అన్నదాతలు ట్రాక్టర్ల వినియోగం, కూలీల రేట్లు, భారీగా పెరగడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో ఎరువుల ధరలను పెంచి రైతులపై మరింత అదనపు భారం మోపొద్దు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి.
– మొద్దు అంజిరెడ్డి, రైతు
