వర్షాలు కురుస్తుండడం.. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో వికారాబాద్ జిల్లాలో వానకాలం పంటల సాగు సంబురంగా సాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,314 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జిల్లా రైతాంగం పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు సాగైన పంటల్లో 65 శాతం మేర పత్తి పంటనే సాగు చేశారు. అత్యధికంగా 1,41,258 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా.. 74,750 ఎకరాల్లో కంది, 13,599 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారు. ఈ నెలాఖరు వరకు పత్తి, కంది పంటలు, ఆగస్టు రెండో వారం వరకు వరితోపాటు ఇతర పంటలు సాగు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యవసాయ శాఖ సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నది. ఈ సీజన్కు 74,683 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆయా పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
వికారాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వానకాలం పంటల సాగు రెండు లక్షల ఎకరాలు దాటింది. ఈ నెల మొదటి వారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఆయా పంటల సాగు జోరందుకుంది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,314 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగం పత్తి పంట సాగువైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం. ఇప్పటివరకు సాగైన ఆయా పంటల్లో 65 శాతం మేర పత్తి పంటనే వేశారు. ఈ నెలాఖరు వరకు పత్తి పంటతోపాటు కంది పంటను సాగు చేసేందుకు అనుకూలమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తదనంతరం సాగు చేసినట్లయితే దిగుబడిపై ప్రభావం పడే అవకాశముందని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు వరితోపాటు మిగతా పంటలు ఆగస్టు రెండో వారం వరకు సాగు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. గత వారం రోజుల నుంచి రైతులు సాగు చేస్తున్న ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 వేల ఎకరాల వరకు ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తయింది.
2,28,314 ఎకరాల్లో ఆయా పంటల సాగు
ఈ నెల మొదటి నుంచి వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు నాటడంలో రైతాంగం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 2,28,314 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా.. అధికంగా పత్తి పంటను సాగు చేశారు. రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించాలనే ఉద్దేశంతో పత్తి సాగు పెంచేందుకు రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం అవగాహన కల్పించారు. వానకాలం సీజన్లో ఆయా పంటలు మొత్తం 5,46,205 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 2,28,314 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, పత్తి-1,41,258., వరి-320., మొక్కజొన్న 13,599., కందులు-63,359., జొన్న 387., మినుములు-2263., పెసలు 5637., సోయాబీన్-979., బఠానీ-512 ఎకరాల్లో వేశారు.
అందుబాటులో సరిపోను ఎరువులు
రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సరిపోను ఎరువులను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీలో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంటల సర్వే నిర్వహిస్తుండడంతో ఎరువులు, విత్తనాలు ఎంతమేర అవసరమనేది ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ వానకాలం సీజన్కు యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్నీ కలిపి 74,683 మెట్రిక్ టన్నులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 28,867., డీఏపీ 15,360., కాంప్లెక్స్ ఎరువులు 21,899., ఎంవోపీ 6206., ఎస్ఎస్పీ 2351 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయి. ప్రతి నెల ఎంతమేర ఎరువులు అవసరమో దానికనుగుణంగా స్టాక్కు 10 శాతం అదనంగా జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతున్నారు.
పీఏసీఎస్, డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులను సరఫరా చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా పూర్తి పారదర్శకంగా ఎరువులను విక్రయిస్తున్నారు. స్టాక్ పాయింట్ నుంచి జిల్లాకు ఎంత సరఫరా అయ్యింది, జిల్లాలోని స్టాక్ పాయింట్ ద్వారా ఆయా ఎరువుల దుకాణాలకు ఎంతమేర ఎరువులు సరఫరా అయ్యాయనే వివరాలతోపాటు జిల్లాలోని ఎరువుల దుకాణాల నుంచి రైతులు ఎంతమేర కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు పత్తి సాగుకు అనుకూలం
– జిల్లా వ్యవసాయాధికారి గోపాల్
వానకాలం సీజన్కు సంబంధించి ఆయా పంటల సాగు విస్తృతంగా సాగుతున్నది. ఇప్పటివరకు అధికంగా పత్తి పంటనే సాగు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు పత్తి, కంది పంటను సాగు చేసుకునేందుకు అనుకూలం. ఆగస్టు రెండో వారం వరకు మిగతా పంటల విత్తనాలను నాటుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం.
సాగు అంచనా
పంట : ఎకరాలు
పత్తి : 2,06,353
కంది : 1,57,205
వరి : 77,554
మొక్కజొన్న : 58,872
జొన్న : 6876
పెసర్లు : 18,269
వేరుశనగ : 357
మినుములు : 10,051
ఆముదం : 76
సోయాబీన్ : 2045
రాగులు : 285
కొర్రలు : 39
గోధుమలు : 42
చెరుకు : 4991
బఠానీ : 1332
నల్ల ఉలవలు : 58