రంగారెడ్డి, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ శశాంకతో కలిసి ఆమె నిర్వహించిన సమావేశంలో కొత్తపేటలో నిర్మిస్తున్న టిమ్స్, మహేశ్వరంలోని మెడికల్ కాలేజీ పనులపై చర్చించారు.
మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రతిపాదనలు, అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సంబంధిత అధికారులతో ఆరా తీశారు. కచ్చితమైన ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు పంపాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ పనులను ఆమె వైద్యారోగ్య జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు. టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎల్అండ్టీ ఇంజినీర్లు వివరించారు. నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
హాస్పిటల్ నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సెక్రటరీ ఆదేశించారు. ఈ పర్యటనలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారిణి డాక్టర్ వాణి, గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ విమలాథామస్, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రియ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్లు జానకి, విజయలక్ష్మి, ఆర్అండ్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.