రంగారెడ్డి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం విజయవంతానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి సూచించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి ప్రజాపాలన కార్యక్రమంపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి
అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమం కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలు కావున ఆ రోజుల్లో కార్యక్రమాలు ఉండవని తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజుకు రెండు గ్రామపంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, డిప్యూటీ తహసీల్దార్లు టీములుగా ఏర్పాటు చేసుకొని.. ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి అధికారుల వరకు అందరూ సమష్టిగా పని చేయాలని సూచించారు. ప్రతి 100 దరఖాస్తులకు ఒక కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో విసృ్తత ప్రచారం చేపట్టాలని, దండోరా చేపట్టాలని, ఒకరోజు ముందుగా టామ్ టామ్ వేయించాలని కోరారు. ప్రజాపాలనకు సంబంధించి ప్రతి కుటుంబానికి దరఖాస్తు అందేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. మండల, మున్సిపల్ స్థాయిలో దరఖాస్తుల స్వీకరణలో, దరఖాస్తులను భద్రపర్చడంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ నివేదికలను ఏరోజుకారోజు పంపించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రిజిస్టర్ను నిర్వహించాలన్నారు. పోలీస్ సిబ్బంది దరఖాస్తులు తీసుకునే కౌంటర్ వద్ద బందోబస్తు క్రౌడ్ మేనేజ్మెంట్ చూడాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో డీఆర్డీవో సంగీత, ఆర్డీవోలు సూరజ్ కుమార్, మల్లయ్య, శ్రీనివాస్, సాయిరాం, అనంతరెడ్డి, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, సోషల్ వెల్ఫేర్ అధికారి రామారావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, సీపీవో సౌమ్య, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.