రంగారెడ్డి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. శుక్రవారం కందుకూరు మండలంలోని గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన పలువురు గిరిజన మహిళలు గిరిజనబంధు పథకాన్ని ప్రవేశ పెడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల మంత్రి సబితారెడ్డి నివాసానికి తరలివచ్చి సంబురాలు జరుపుకొన్నారు. సంప్రదా య నృత్యం చేస్తూ సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతోనే దళితబంధు మాదిరిగానే గిరిజనుల అభ్యున్నతికి గిరిజనబంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారన్నారు. ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇవ్వకున్నా రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా సీఎం కేసీఆర్ నిలిపారన్నారు. ఇంటింటికీ తాగునీరును సరఫరా చేయడంతో ‘మిషన్ భగీరథ’కు అవార్డు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ పల్లెలు, పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులతోపాటు దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఏ రాష్ర్టానికి రానన్నీ అవార్డులు తెలంగాణకు రావటం చాలా గర్వంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన మహిళలను మంత్రి ఆప్యాయంగా పలకరించా రు. ఈ సందర్భంగా గమ్మడవెళ్లి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టాలని ప్రజలు కోరగా.. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ కందుకూరు మండలాధ్యక్షుడు జయేందర్ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, గిరిజన నేతలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.