వీధి నాటకాలకు కొందరు కళాకారులు ఇప్పటికీ జీవం పోస్తుండడంతో వాటికి పూర్వ వైభవం వస్తున్నది. ఊరూరా తిరుగుతూ వీధి నాటకాలను ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు కళాకారులకు విరాళాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో రోజురోజుకూ వీధి నాటకాలకు క్రేజ్ పెరుగుతున్నది.
-కులకచర్ల, మే 20
కులకచర్ల, మే 20 : అంతరించి పోతున్న వీధి నాటకాలకు కొందరు కళాకారులు జీవం పోస్తున్నారు. ఊరూరా తిరుగుతూ వీధి నాటకాలను ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. భారతీయ సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించేలా నాటకాలు ఉంటుండటంతో చాలా మంది వాటిని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు కళాకారులకు విరాళాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. నేటి సమాజంలో టీవీ, సినిమాలు, సీరియళ్లపై మోజు పెరిగినా వీధి నాటకాలకు ఉండే క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. గతంలో కళాకారులు రెండు మూడు నెలలపాటు శిక్షణ తీసుకుని మరీ వీధి నాటకాలను ప్రదర్శించేది. వీధి నాటకం ప్రదర్శించే గ్రామంలో ఆ రోజు పండుగ వాతావరణం నెలకొనేది. గ్రామస్తులంతా అక్కడికొచ్చి వీక్షించేవారు. సంస్కృతీసంప్రదాయాలతోపాటు బంధాలు, బంధుత్వాల గురించి బాగా చెప్పే వారని వృద్ధులు చెబుతున్నారు. కొన్ని కుటుంబాలు ఈ నాటకాలకు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించి సంతోషంగా జీవితాన్ని కొనసాగించేవని వారి పేర్కొంటున్నారు. టీవీలు, సీరియళ్లు, సినిమాలు రావడంతో వాటి ప్రభావం తగ్గిందంటున్నారు.
గ్రామాల్లో పెరిగిన ఆసక్తి..
గ్రామాల్లో టీవీలు, సినిమాలను ఒకవైపు చూస్తున్నా వీధి నాటకాలపై కూడా ప్రజలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నాటకాలను ప్రదర్శించేందుకు యువతతోపాటు పెద్దలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. గ్రామాల్లో కొంతమంది వీధి నాటకాలను ప్రత్యేకంగా నేర్చుకొని గ్రామస్తులు, కుటుంబసభ్యుల మధ్య ప్రదర్శించి మురిసిపోతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కళాకారులకు సమున్నత స్థానం కల్పించి ప్రోత్సహిస్తుండంతోపాటు నేడు గ్రామాల్లో వీధి నాటకాలకు క్రేజీ పెరిగింది. మండలంలోని బొంరెడ్డిపల్లి, కులకచర్ల, చాపలగూడెం, సాల్వీడ్, వీరాపూర్, ముజాహిద్పూర్తోపాటు పలు గ్రామాల్లో వీధి నాటకాల ప్రదర్శనపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కొందరు యువకులు, పెద్దలు శిక్షణ తీసుకుని మరీ వివిధ పాత్రలు, సన్నివేశాల్లో నటించి గ్రామస్తులను ఆకట్టుకున్నారు. వాటిని వీక్షిస్తున్న ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు విరాళాలను అందించి వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
పౌరాణిక నాటకాలతో..
కులకచర్ల, దోమ మండలాలతోపాటు పలు మండలాల్లో పౌరాణిక వీధి నాటకాలను ప్రదర్శించేందుకు కళాకారులు ఆసక్తి చూపుతున్నారు. చాలావరకు భక్తప్రహ్లాద, భక్తసిరియాళ, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, చెన్నకేశవస్వామి మహాత్మ్యంతోపాటు భక్తికి సంబంధించిన నాటకాలను ప్రదర్శిస్తున్నారు. గ్రామాల్లో కొంత మంది కళాకారులు బృందాలుగా ఏర్పడి పౌరాణిక నాటకాల్లో అనుభవం ఉన్న వారి ద్వారా ప్రత్యేకంగా తీసుకొని నాటకాల్లో నాటించి ప్రజల మన్ననలను పొందుతున్నారు.
వీధి నాటకాలకు నాయకుల ప్రోత్సాహం..
పరిగి నియోజకవర్గంలో ప్రతిరోజూ ఏదో ఒక గ్రామంలో వీధి నాటకాల ప్రదర్శన జరుగుతూనే ఉన్నది. వీధి నాటకాల ప్రదర్శన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డిలతోపాటు పలువురు నాయకులు వీధినాటకాల నిర్వహణకు వారి వంతుగా ఆర్థిక సాయాన్ని నిర్వాహకులకు అందిస్తూ ప్రోత్సహిస్తు న్నారు. దీంతో ఊరూరా వీధి నాటకాలను ప్రదర్శించేందుకు కళాకారులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రజలు చూసేందుకు అధికంగా వస్తున్నారు
ఊరూరా తిరిగి వీధి నాటకాలను ప్రదర్శిస్తున్నాం. ప్రజలు కూడా వీక్షించేందుకు అధికంగా వస్తున్నారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటున్నది. ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు విరాళాలు అందిస్తూ తమను ప్రోత్సహిస్తున్నారు.
-పుట్టి రాములు, కళాకారుడు బొంరెడ్డిపల్లి
కళాకారులను ప్రోత్సహించాలి
గ్రామాల్లో నేటికీ కళలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కళాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు తమ కళను మరింత ప్రదర్శించే అవకాశముంటుంది. ఇందుకోసం ప్రభు త్వం కళాకారులకు ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి.
-పీరంపల్లిరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కులకచర్ల