వికారాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. వేసవికి ముందే నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడం అన్నదాతలను ఆందోళన కలిగిస్తున్నది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చలితోపాటు ఎండ తీవ్రత కూడా పెరుగడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ జనవరి చివరి నాటికి 3.73 మీటర్ల మేర భూగర్భ నీటి నిల్వలు తగ్గాయి. అప్పుడు 8.25 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు.. ప్రస్తుతం 11.98 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. మరోవైపు వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు, కొత్త పైపులైన్ల నిర్మాణం, గ్రామ పంచాయతీల్లోని పంపుసెట్లకు మరమ్మతులు వంటి పనులను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
11.98 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు..
జిల్లాలో సగటున 11.98 మీటర్ల లోతుకు భూగర్భ జలాలలు అడుగంటిపోయాయి. అత్యధికంగా మర్పల్లి మండలం నర్సాపూర్లో 33.35 మీటర్ల లోతుకు భూగర్భ నీటి మట్టాలు పడిపోయాయి. నవాబుపేట మండలం మాదిరెడ్డిపల్లిలో 24.36 మీటర్లు, బొంరాసుపేట మండలంలోని అంసన్పల్లిలో 27.10 మీటర్లు, గౌరారంలో 26.35 మీటర్లు, బూరాన్పూర్లో 15.16 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. పెద్దేముల్ మండలంలోని నాగులపల్లిలో 32.50 మీటర్లు, దోమ మండలం దిర్సంపల్లిలో 18.40 మీటర్లు, యాలాల మండలంలోని దేవనూర్లో 24.59 మీటర్లు, మర్పల్లి మండలం దర్గుపల్లిలో 19.56 మీటర్లు, మర్పల్లిలో 15.70 మీటర్లు, వికారాబాద్ మండలం మైలార్దేవ్పల్లిలో 15.48 మీటర్లు, ధారూరు మండలం అంతారంలో 15.56 మీటర్లు, దోమలో 15.93 మీటర్లు, కోట్పల్లిలో 15.38 మీటర్లు, కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్లో 14.82 మీటర్లు, పరిగిలో 13.92 మీటర్లు, రాపోల్లో 15.13 మీటర్లు, తాండూరు మండలంలోని ఉద్దండాపూర్లో 22.64 మీటర్లు, జిన్గుర్తిలో 21.20 మీటర్లు, కొడంగల్ మండలం ఉప్పర్పల్లిలో 13.14 మీటర్ల లోతుకు భూగర్భ నీటిమట్టాలు పడిపోయాయి.
రూ.5.51 కోట్లతో సమ్మర్ యాక్షన్ ప్లాన్..
గ్రామ పంచాయతీల్లో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకుగాను రూ.5.51 కోట్లతో జిల్లా మిషన్ భగీరథ అధికారులు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకుగాను పరిగి సబ్ డివిజన్కు రూ.1.30 కోట్లు, కొడంగల్ సబ్ డివిజన్కు రూ.1.04 కోట్లు, తాండూరు సబ్ డివిజన్కు రూ.1.62 కోట్లు, వికారాబాద్ సబ్ డివిజన్కు రూ.1.54 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లోని 1446 వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయడంతోపాటు నీటిలో బ్లీచింగ్ వేసేందుకుగాను రూ.1.14 కోట్లు అవసరమని అంచనా వేశారు. పైపులైన్ లికేజీల మరమ్మతులకు సంబంధించి జిల్లావ్యాప్తంగా రూ.2.39 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పరిగి నియోజకవర్గానికి రూ.54.83 లక్షలు, కొడంగల్ సబ్ డివిజన్కు రూ.51.15 లక్షలు, తాండూరు సబ్ డివిజన్కు రూ.63.15 లక్షలు, వికారాబాద్ సబ్ డివిజన్కు రూ.70.1 లక్షలు అవసరమని యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 3360 పంపుసెట్లు ఉండగా, వీటిలో పరిగిలో 1176 పంపుసెట్లు, కొడంగల్ సబ్ డివిజన్లో 434 పంపుసెట్లు, తాండూరు సబ్ డివిజన్లో 1008 పంపుసెట్లు, వికారాబాద్ సబ్ డివిజన్లో 742 పంపుసెట్లు ఉన్నాయి. పాడైన పంపుసెట్లను మరమ్మతులు చేసేందుకుగాను రూ.1.97 కోట్లు అవసరమని అంచనా వేశారు, వీటిలో పరిగికి రూ.60.40 లక్షలు, కొడంగల్కు రూ.21.70 లక్షలు, తాండూరుకు రూ.56.25 లక్షలు, వికారాబాద్కు రూ.59.55 లక్షలు అవసరమని అధికారులు అంచనా వేశారు.