కడ్తాల్, డిసెంబర్ 25 : ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలన్న సుభాశ్ పత్రీజీ సంకల్పం చాలా గొప్పదని ది ఇండియన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపక సభ్యురాలు స్వర్ణమాల పత్రీ, క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్కుమార్ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురి మహేశ్వర మహా పిరమిడ్లో, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సెలవు దినంతోపాటు క్రిస్మస్ పండుగ సందర్భంగా మహాయాగంలో ధ్యానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ప్రాతఃకాల ధ్యానంలో ఆధ్యాత్మిక గురువులు, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి స్వర్ణమాల పత్రీ, బ్రదర్ అనిల్కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతిఒక్కరితో ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని తెలిపారు. ఎదుటి వారితో ప్రేమ, దయతో ఉంటారో వారే నిజమైన దేవుళ్లు అన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు కృంగిపోవద్దని, నమ్మకంతో చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారన్నారు. జీసస్ ఈ ప్రపంచానికి ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి సందేశాలిచ్చారని తెలిపారు. జీవహింస మహా పాపమని, ఏ జీవిని కూడా హింసించకూడదన్నారు. హింసలేని ప్రపంచాన్ని నిర్మించేందుకు ప్రతి ధ్యాని కృషి చేయాలని పేర్కొన్నారు.
ప్రముఖ సినీ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ధ్యాన సందేశామిచ్చారు. అనంతరం జీసస్ దివ్య ప్రవచనాలు అనే అనువాద పుస్తకాలను ట్రస్టు సభ్యులతో కలిసి బ్రదర్ అనిల్కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిరమిడ్ ప్రధాన వేదికపై క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆలపించిన జానపద పాటలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరిస్తున్నాయి. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు బాలకృష్ణ, సాంబశివరావు, హనుమంతురాజు, శివప్రసాద్, మాధవి, దామోదర్రెడ్డి, ప్రేమయ్య, లక్ష్మి, సౌమ్యకృష్ణ, శ్రీరాంగోపాల్, రాంబాబు, మోత్యానాయక్, ధ్యానులు పాల్గొన్నారు.