కొత్తూరు రూరల్ : ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కొత్తూరు మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో కోవిడ్ వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. దవాఖానలో ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వంటి వాటిపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్పై, కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.
దవాఖానలో ప్రసవం అయిన బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలను చేయించుకోవటం వలన లభించే లాభాలు, ఉపయోగాలను బాలింతలకు వివరించారు. కాన్పులో బాలికలు పుడితే 13వేలు, బాలురు పుడితే 12వేలు ప్రభుత్వం ఇస్తుందని, ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ దామోదర్, కొత్తూరు వైద్యాధికారి డాక్టర్ కవిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.