నందిగామ, ఫిబ్రవరి 12 : భారతదేశంలో భగవంతుడే జాతి జీవన సూత్రమని ప్రపంచ నాగరికతకు ఈ జీవన విధానమే ఆధారమని యోగదా సత్సంగ సొసైటీ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ అధ్యక్షుడు స్వామి చిదానందగిరి అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ఆదివారం జరిగిన వైఎస్ఎస్ సంగం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్వోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి 3500 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి చిదానందగిరి మాట్లాడుతూ.. మానవ జాతికి ఒక భద్రమైన, సమృద్ధమైన, ఆనందమైన భవిష్యత్ కావాలంటే ఈ చైతన్యాన్ని ప్రపంచ మానవులందరిలో నెలకొల్పాలని సూచించారు. స్వర్ణమయమైన సనాతన భారతీయ ఆధ్యాత్మిక నాగరికతకు, భవిష్యత్లో రాబోయే ఏక ప్రపంచ ఆధ్యాత్మిక నాగరికతకు మధ్య వారధులుగా తయారవ్వాలని భక్తులకు సూచించారు.
యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకుడు పరమహంస యోగదా ధ్యానం, సంగం, గురుకృపతో కూడిన మూడు అంశాల సాధన మార్గాన్ని ప్రసాదించారని స్వామి తెలిపారు. ఈ మూడింటి సమ్మేళనమే ఈనాటి కార్యక్రమం ప్రధాన సూత్రమన్నారు. క్రియాయోగ శరణం అని ఆయన అభివర్ణించారు. తద్వారా దివ్యానందం, దివ్యకాంతి అనే స్వర్ణ ద్వారాలు తెరుచుకుంటాయన్నారు. కార్యక్రమంలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఉపాధ్యక్షుడు స్వామి విశ్యానందగిరి, యోగదా సత్సంగ సొసైటీ ఉపాధ్యక్షుడు స్వామి స్వరణనందగిరి, ప్రధాన కార్యదర్శి ఈశ్వరనందగిరి పాల్గొన్నారు.