షాద్నగర్ : వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంపై రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు సంతోషంగా ఉన్నారని, ఇందులో భాగంగానే పాడి రైతులు వినియోగించే చాప్ కట్టర్ యంత్రాలకు ఉచితంగా విద్యుత్ను అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో పాడి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ పొలాల వద్ద, ఆవుల షేడ్ల వద్ద పాడి రైతులు ఏర్పాటు చేసుకున్న చాప్ కట్టర్ యంత్రాలకు విజిలెన్స్ అధికారులు పెద్ద మొత్తంలో జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తున్నారని, ఒక్కొ రైతుకు రూ. 20వేల జరిమానా కూడా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తు ప్రభుత్వానికి తెలిపారు.
ప్రతి రోజు కేవలం 10నిమిషాల సమయం పాటు చాప్ కట్టర్ను వినియోగిస్తారని, విద్యుత్ను ఎక్కువగా వినియోగించరని తెలిపారు. నిమిషాల వ్యవధిలో వినియోగించే యంత్రానికి వేల రూపాయల జరిమానాలు కట్టలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదే విధంగా కేసుల పేరుతో రైతులను సంబంధిత శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే పాడి రైతుల శ్రేయస్సు దృష్ట్యా చాప్కట్టర్ వినియోగానికి ఉచితంగా విద్యుత్ను అందిస్తే రైతులు బాగుపడుతారని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే లేవనెత్తిన సమస్యపై సంబంధిత శాఖ మంత్రి సానుకులంగా స్పందించారు.