ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6 : శివారు ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు రాజ్యమేలుతున్నాయి. బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతు న్నాయి. దీంతో శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని యువత, విద్యార్థులు వాటిని తీసుకుంటూ మత్తుకు చిత్తవుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల తుర్కయాంజాల్లో ఓ యువకుడు మత్తుకు బానిసై జన్మనిచ్చిన తండ్రిపైనే పెట్రోల్ పోసి దారుణంగా చంపేశాడు.
ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫామ్హౌస్లు వెలిశాయి. అక్కడ రాత్రివేళల్లో పుట్టినరోజు వేడుకలు, ఇతర ఫంక్షన్లు జరుగుతుంటాయి. వాటిలో డ్రగ్స్, గంజాయి, హుక్కా వంటి వాటిని వాడుతున్నట్లు సమాచారం. అలాగే, శివారు ప్రాంతాలు ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్నాయి. ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, ఘట్కేసర్ ఆదిబట్ల, మంగల్పల్లి, బొంగుళూరు, తుర్కయాంజాల్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఇంజినీరింగ్తోపాటు వివిధ కోర్సుల కళాశాలలు.. వందలాది ప్రైవేట్ హాస్టళ్లున్నాయి.
పలు దేశాలకు చెందిన యువతీయువకులు వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. కళాశాలల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది పెద్ద ఎత్తున గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ వారిని డ్రగ్స్కు బానిసలుగా మార్చుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల పెద్ద ఎత్తున గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కేసులు నమోదవుతున్నాయి. రెండుమూడు రోజులకోసారి గంజాయి అక్రమ నిల్వలను పోలీసులు పట్టుకుంటున్నారు. ఇటీవల ఓఆర్ఆర్ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న గంజాయిని హయత్నగర్, ఆదిబట్ల పోలీసులు పెద్ద ఎత్తున సీజ్చేశారు. తాజాగా గురువారం ఇబ్రహీంపట్నంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
గంజాయి మత్తులో యువత పక్కదారి పట్టడమే కాకుండా వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నది. యువత, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి ముఠాలు రెచ్చిపోతు న్నాయి. పుట్టిన రోజులు, ఇతర పార్టీలు చేసుకునే ఇంజినీరింగ్ విద్యార్థులకు నేరుగా గంజా యి, ఇతర మాదక ద్రవ్యాలను చేరవేస్తున్నారు. దీంతో వారు దానికి బానిసై తమ బంగారు భవిష్యత్తుతోపాటు తల్లిదండ్రుల ఆశలను కూడా నీరుగార్చుతున్నారు. డ్రగ్స్ మత్తులో ఇంట్లోని వారిని ఇబ్బందులకు గురి చేయడంతోపాటు ఘర్షణకు దిగుతున్నారు. ఇటీవల డ్రగ్స్ మత్తులో తుర్కయాంజాల్లో ఓ యువకుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపేశాడు.
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా కళాశాలలు, వసతిగృహాలు వంటి ప్రాంతాల్లో పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టాం. మత్తు పదార్థాలు వాడినా, విక్రయించినా చట్టరీత్యా నేరం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
-పీవీఎస్ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ