న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ ;గణనాథుల నిమజ్జనం గురువారం నుంచి శుక్రవారం వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. జై బోలో గణేశ్ మహరాజ్కీ జై.. అంటూ నినాదాలు. గణపతి బొప్పా మోరియా అంటూ.. ఉత్సాహంగా యువతీయువకులు ఆటపాటల నడుమ శోభాయాత్రలు సాగాయి. వినాయక విగ్రహాల ఊరేగింపులతో పట్టణాలు, గ్రామాల్లో సందడి నెలకొన్నది. ఎక్కడచూసినా డప్పుల దరువు, డీజేల హోరుతో చిన్నాపెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పలు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో తాగునీరు, ప్రసాదం పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. నిమజ్జనంలో ప్రజాప్రతినిధులు పాల్గొని యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఘన పూజలందుకున్న గణనాథుడికి ఉమ్మడి రంగాడ్డి జిల్లావాసులు గురువారంతో పాటు శుక్రవారం కూడా ఘన వీడ్కోలు పలికారు. ఉదయమే మండపాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి వివిధ ఆకృతులతో వినాయక ప్రతిమల రథాలను అలంకరించారు. అనంతరం వాహనాలపై నిమజ్జనానికి తరలించారు. మేళతాళాలు, డీజే మోతల మధ్య యువతీయువకులు నృత్యాలు, కోలాటాలు, భజనలతో వినాయక శోభాయాత్రలు కనుల పండువగా కొనసాగాయి. విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. వైభవంగా సాగిన ఈ యాత్రలకు జనం నీరాజనం పట్టారు. ‘జై గణేశా.. జై జై గణేశా..’, ‘గణపతి బొప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ నినాదాలు మిన్నంటాయి. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగుల వద్ద గణపయ్యను నిమజ్జనం చేసి పోయిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా.. అంటూ వీడ్కోలు పలికారు.