అబ్దుల్లాపూర్మెట్ : ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక ప్రజల సంక్షేమం ఉంటుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్ను ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోహెడ మార్కెట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ఎక్కడ కూడా రాజీపడకుండా నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. త్వరలో అన్ని హంగులతో అధునాతన మార్కెట్ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గడ్డిఅన్నారంలో రాత్రి 10 తర్వాత పండ్ల వాహనాలకు అనుమతి ఉండేదని ప్రస్తుతం బాటసింగారంలో అలాంటి సమస్య లేకుండా 24గంటలు వాహనాల రాకపోకలకు అవకాశం ఉంటుందన్నారు. రైతులకు, వ్యాపారస్తులకు, హమాలీలకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు.
ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే వారం తర్వాత రివ్యూ చేసి ఇంకా ఏమైనా అవసరం ఉంటే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయదశమి రోజు వ్యాపార లావాదేవిలు మొదలు పెడుతున్న వారందరికీ విజయం చేకూరాలని, భవిష్యత్లో ఇంకా బాగా ఎదుగలన్నారు. ప్రభుత్వం నిరంతరం మీ వెంట ఉంటూ ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పండ్ల క్రయ, విక్రయాలు వేలం పాటలో పాల్గొని ఫైన్ హ్యాపిల్, సంత్ర, బ్లాక్ గ్రేప్స్ పండ్లను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కొహెడలో 170 ఎకరాల్లో నిర్మిస్తున్న మార్కెట్కు, గడ్డి అన్నారంలో నిర్మించే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ రోజే నిధులు ఇప్పిస్తానన్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు బాటసింగారంలోనే క్రయ, విక్రయాలు జరుగుతాయని తెలిపారు. భవిష్యత్లో కొహెడ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్గా తయారవుతుందన్నారు.
రైతులకు, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖ, పాలకవర్గం పై ఉందన్నారు. సీజన్లో చాలా పండ్లు మార్కెట్కు వస్తాయని దీంతో ఇబ్బందులు రాకుండా త్వరలో రివ్యూ చేసి పరిష్కారమార్గం చూపుతామన్నారు. మార్కెట్ ఏర్పాటుతో పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. మర్కెట్లో సంవత్సరానికి వెయ్యికోట్ల టర్నవర్ అవుతుందన్నారు. లాజిస్టిక్ పార్కులో భూములు కోల్పోయిన 10 మందికి 120 గజాల స్థలం ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అందరం సమన్వయంతో ముందుకు వెళ్లి సహకరిస్తామన్నారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ రాబోయే సౌత్ ఏషియన్ కంట్రీలలో కొహెడ మార్కెట్ నంబర్వన్గా నిలుస్తుందన్నారు. రూ. 12వందల కోట్లతో 2 వేల బెడ్స్తో అన్ని విభాగాలు ఉండే విధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరుగుతందన్నారు. ఈ ఆసుపత్రి ఎల్బీనగర్ నియోజకవర్గంకు రావడం సంతోషకరమన్నారు. పరిసర జిల్లాలు, నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉందన్నారు.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్లో వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కోల్డ్ స్టోరేజ్, విశ్రాంత గదులు, మూత్రశాలలు, పెట్రోల్బంక్, ధర్మకాంటతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. మార్కెట్ ఏర్పాటుతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మార్కెట్కు రోజు రెండు ట్రిప్పులు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఉన్నతశ్రేణి కార్యదర్శి వైజె పద్మహర్ష, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు అక్భర్ అలీఖాన్, ఎంపీపీ బుర రేఖమహేందర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్పాష, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ డైరక్టర్లు కొత్త కిషన్గౌడ్, రమేశ్, లాజిస్టిక్పార్కు మేనేజర్ గురుపాదం, అదనపు మేనేజర్ ప్రభాకర్, పరిసర గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పలు పార్టీల నాయకులు ఉన్నారు.