ఇబ్రహీంపట్నం రూరల్/మొయినాబాద్, మార్చి 4: ప్రస్తుత సమాజంలో ప్రతిరోజూ దేశంలోని ఏదో ఒక ప్రాంతం లో బాలికలు, ఆడ పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చదువులకోసం బయటికి పంపించాలంటేనే ఆందోళన చెందుతున్నారు. బాలికలకు చదువు ఒక్కటే సరిపోదని.. వారు ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకు కరాటే లాంటి సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ప్రభుత్వం భా వించింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లాలోని విద్యా శాఖ అధికారులు నిపుణులైన శిక్షకులతో అన్ని జడ్పీహెచ్ఎస్లు, గురుకుల పాఠశాలల్లో కరాటే తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులు ఇటీవలే ప్రారంభం కాగా నెల రోజుల వరకు కొనసాగనున్నాయి.
ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థినులకు కరాటేలో శిక్షణ కొనసాగుతున్నది. ఈ శిక్షణతో తమ పిల్లలు ఎలాంటి ఘటనైనా ఎదుర్కొంటారనే నమ్మ కం తమలో కలిగిందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 264 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ తరగతులు ఇటీవలె ప్రారంభమై నెల రోజుల వరకు ప్రతిరోజూ గంట పాటు కొనసాగుతాయని డీఈవో సుశీందర్రావు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన కరాటే మాస్టర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. శిక్షణలో భాగం గా వారు బాలికలకు వివిధ అంశా ల్లో ఎదురయ్యే ఘటనలపై ఆత్మరక్షణలో మెళకువలు నేర్పిస్తారన్నారు.
విద్యార్థినులు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్లకు కాలినడక వచ్చి వెళ్తుంటారని.. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరిగినా వాటిని అధిగమించి.. తమను తాము కాపాడుకునేందుకు కరాటే ఎంతో దోహదపడుతుందన్నారు. కాగా జిల్లాలో ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులను విద్యాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా మొయినాబాద్ మండలంలోని ఎతుబార్పల్లి గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక సం క్షేమ చేవెళ్ల గురుకుల స్వచ్ఛ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు ఆత్మరక్షణ నిమిత్తం కరాటేలో ట్రైనింగ్ క్లాసులు పాఠశాల ప్రిన్సిపాల్ రమాదేవి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. విద్యార్థినులకు చదువుతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉచితంగా కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పాఠశాలలోనే చదువుతున్న ఓ విద్యార్థిని తండ్రి రాము స్వచ్ఛందంగా విద్యార్థినులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. కరాటేలో శిక్షణతో భవితకు రక్షణగా ఉంటుందని పేర్కొన్నారు.
బాలికల్లో మనోధైర్యం పెరుగుతుంది
కరాటే నేర్చుకుంటున్న బాలికల్లో మనోధైర్యం పెరుగుతుంది. ఎలాంటి ఘటనలు ఎదురైనా ఎదుర్కొంటామనే ధీమా వారికి వస్తుంది. నెల రోజుల వరకు విద్యార్థినులకు ఈ తరగతులు కొనసాగుతాయి. కరాటే శిక్షణకు విద్యార్థినులు అధిక సంఖ్యలో వస్తున్నారు. –శ్రీనివాస్,కరాటే మాస్టర్, ఇబ్రహీంపట్నం
ప్రతి విద్యార్థినికీ ఎంతోమేలు
జిల్లాలోని 264 ఉన్నత పాఠశాలల్లో నిపుణులైన శిక్షకులతో విద్యార్థినులకు కరాటేలో శిక్షణ ఇప్పిస్తు న్నాం. ఈ ట్రైనింగ్ నెల రోజుల వరకు కొనసాగనున్నది. ఇందులో విద్యార్థినులు ఎలాంటి ఘటనలు ఎదురైనా తమను తాము రక్షించుకునేలా శిక్షకులు వారిని తీర్చిదిద్దుతారు. నాణ్యమైన విద్యతోపాటు కరాటేలో శిక్షణ ఇప్పిస్తుండటంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి పాఠశాలలోనూ ఒక తరగతి గదిని కరాటే నేర్పించేందుకు కేటాయించాం.
– సుశీందర్రావు, జిల్లా విద్యాధికారి
ఎంతో ధైర్యంగా ఉన్నది
మా పాఠశాలలో ఆత్మరక్షణ కోసం కరాటేను నేర్పిస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో కరాటే మాస్టర్ పలు మెళకువలు చెబుతున్నారు. తమను తాము ఎలా రక్షించుకోవాలో సూచిస్తున్నారు. దీంతో ఎదుటి వారిని ఎదుర్కొంటామనే నమ్మకం కలుగుతున్నది.
–సరిత, 8వ తరగతి, ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాల